PM Modi China Visit: ప్రధానమంత్రి మోదీ చైనా పర్యటన.. SCO సదస్సులో పుతిన్, జిన్పింగ్లతో భేటీ!
జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు.
- By Gopichand Published Date - 03:30 PM, Tue - 26 August 25

PM Modi China Visit: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా పర్యటనకు (PM Modi China Visit) వెళ్లనున్నారు. అక్కడ జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో మోడీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొంటారు. ఈ సమావేశానికి ముందు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. మంగళవారం (ఆగస్టు 26) నాడు ఆయన మాట్లాడుతూ.. రష్యా-చైనా సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత స్థిరమైనవిగా పేర్కొన్నారు. ఒక నివేదిక ప్రకారం మోదీ, పుతిన్లను సాదరంగా ఆహ్వానించడానికి జిన్పింగ్ సిద్ధంగా ఉన్నారు.
అమెరికా, భారత్ మధ్య ఉద్రిక్తతలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్-రష్యా సంబంధాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని కారణంగా ట్రంప్ భారత్పై 50 శాతం టారిఫ్ విధించారు. ట్రంప్ నిర్ణయం తప్పు అని రష్యా గతంలో పేర్కొంది. ఈ SCO సదస్సులో పుతిన్ కూడా పాల్గొననున్నారు. అంతకుముందు జిన్పింగ్ మాట్లాడుతూ “మా సంబంధాలు అత్యంత స్థిరంగా, పరిణతి చెందినవిగా ఉన్నాయి. వ్యూహాత్మకంగా ఇది మాకు చాలా ముఖ్యం” అని అన్నారు.
Also Read: IND vs PAK: ఆసియా కప్లో భారత్- పాక్ జట్ల మధ్య రికార్డు ఎలా ఉందంటే?
చైనాకు ముందు జపాన్ పర్యటన
ప్రధాని మోదీ ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 1 వరకు జపాన్, చైనా పర్యటనలలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జపాన్లో 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత చైనాలో జరిగే SCO 25వ సమావేశంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ రాబోయే పర్యటన గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక పత్రికా సమావేశంలో వెల్లడించింది. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. “ఆగస్టు 29, 30 తేదీల్లో ప్రధాని మోదీ జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు” అని చెప్పారు.
జిన్పింగ్తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాగే మధ్య ఆసియా, దక్షిణ ఆసియా, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియాకు చెందిన అనేక మంది ప్రముఖ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. గత సంవత్సరం రష్యాలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో కూడా ప్రధాని మోదీ జిన్పింగ్, పుతిన్లతో వేదికను పంచుకున్నారు.