Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
- Author : Vamsi Chowdary Korata
Date : 25-05-2026 - 10:14 IST
Published By : Hashtagu Telugu Desk
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఆశాభావంతో ముడి చమురు ధరలు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 4.55 శాతం తగ్గి 98.83 డాలర్లకు చేరగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర 4.73 శాతం క్షీణించి 92.03 డాలర్ల వద్ద ఉంది. ఈ పరిణామం మార్కెట్ సెంటిమెంటును బలపరిచింది.
ఈ పరిణామాలపై జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ మాట్లాడుతూ ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్కు ఒక టర్నింగ్ పాయింట్గా మారవచ్చని అభిప్రాయపడ్డారు. “అంతేకాకుండా, నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలకు మించి రావడం, రూపాయి విలువ ఇటీవల కనిష్ట స్థాయిల నుంచి కోలుకోవడం కూడా సానుకూల అంశాలు. విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIs) తిరిగి రావాలంటే కరెన్సీలో స్థిరత్వం చాలా అవసరం” అని ఆయన వివరించారు.
అయితే, అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. చర్చల విషయంలో తొందరపడొద్దని తన ప్రతినిధులకు సూచించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించడం గమనార్హం. దీంతో ఒప్పందంపై కొంత అనిశ్చితి కొనసాగుతోంది.