Online NEET Exam: వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లో నీట్ పరీక్ష.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 12:57 IST
Published By : Hashtagu Telugu Desk
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ (NEET UG) పరీక్షా విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణను ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పరీక్షను పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. జాతీయ ప్రవేశ పరీక్షల వ్యవస్థలో ఇది ఒక ప్రధాన సంస్కరణగా నిలవనుంది.
ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన నీట్ యూజీ 2026 పరీక్షను తిరిగి జూన్ 21న నిర్వహించనున్నట్లు ధ్రువీకరించారు. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డులను జూన్ 14 నాటికి జారీ చేస్తామని తెలిపారు. మే 3న పరీక్ష నిర్వహించగా, మే 7న “గెస్ పేపర్” గురించి ఆందోళనలు వ్యక్తమయ్యాయని, కొద్ది రోజుల్లోనే పేపర్ లీక్ అయినట్లు అధికారులు నిర్ధారించారని ఆయన వివరించారు.
“లీకేజీ వాస్తవమని తేలిన వెంటనే, విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకూడదని నిర్ణయించుకుని మే 12న పరీక్షను రద్దు చేశాం” అని ప్రధాన్ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలను, అసాంఘిక శక్తులను ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పేపర్ లీకేజీ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తో లోతైన విచారణ జరిపిస్తామని, దీని మూలాలను కనుగొనాలని ఏజెన్సీలను ఆదేశించినట్లు చెప్పారు. “కష్టపడి చదివే విద్యార్థుల సీట్లను ఏ మాఫియా కూడా లాక్కోవడానికి వీల్లేదు. విద్యార్థుల నమ్మకమే మాకు అత్యంత ముఖ్యం” అని ఆయన అన్నారు.
గతంలో ఇలాంటి సంఘటనల నేపథ్యంలోనే రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. ఆ కమిటీ సిఫార్సులను అమలు చేసినప్పటికీ, పరీక్షల నిర్వహణలో లోపం జరిగిందని అంగీకరించారు. సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు ఏర్పాటైన ఎన్టీఏలో నిరంతర సంస్కరణలు జరుగుతున్నాయని, ‘జీరో-ఎర్రర్’ పరీక్షల నిర్వహణకు వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
రద్దయిన పరీక్షకు హాజరైన అభ్యర్థులకు వారి పరీక్ష ఫీజును తిరిగి వాపసు ఇస్తామని, త్వరలో నిర్వహించే రీ-ఎగ్జామ్ను ఉచితంగా నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్షకు వారం రోజుల ముందు తమకు నచ్చిన పరీక్షా నగరాన్ని ఎంచుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీలైనంత వరకు రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు.