Baba Ramdev : సహజంగానే మనిషి ఆయుష్షు 150 నుంచి 200 ఏళ్లు: బాబా రాందేవ్ కీలక వ్యాఖ్యలు
సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది.
- By Latha Suma Published Date - 03:56 PM, Tue - 1 July 25

Baba Ramdev : ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా అకాల మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటన తరువాత యాంటీ ఏజింగ్ మందుల వినియోగం, వాటి ప్రమాదకర ప్రభావాలపై బహుళముఖ చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సహజ జీవనశైలిని అనుసరించగలిగితే మనిషి జీవిత కాలం వందేళ్లకే పరిమితం కాదు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక సమతౌల్యం ఉంటే 150 నుంచి 200 ఏళ్ల వరకు కూడా జీవించవచ్చు అని ఆయన అన్నారు. ఆధునిక జీవనశైలిపై ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి శరీరం ఓ అద్భుతమైన యంత్రం లాంటిది. కానీ అదే శరీరంపై మనం ఎక్కువ ఒత్తిడి పెడుతున్నాం. శరీరానికి అవసరమైన ఆహారం మోతాదును మించిపోయి తీసుకుంటున్నాం. 100 ఏళ్లలో తినాల్సినంత ఆహారాన్ని కొందరు 25 ఏళ్లకే తినేస్తున్నారు. ఇది శరీర వ్యవస్థను బలహీనపరుస్తోంది అని వ్యాఖ్యానించారు.
Read Also: CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
తన అనుభవాన్ని పంచుకుంటూ నేను ఇప్పటికే 60 సంవత్సరాలు దాటాను. అయినా నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. దానికి కారణం యోగా, సత్వరమైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అని తెలిపారు. అంతర్గత ఆరోగ్యం ముఖ్యం అని స్పష్టంగా చెప్పారు. షెఫాలీ జరీవాలా మృతిపై మాట్లాడుతూ..ఇప్పటి యువత దృశ్యపరంగా మంచి ఆరోగ్యంతో కనిపించవచ్చు. కానీ శరీర అంతర్గత వ్యవస్థలు దెబ్బతిన్నప్పుడు హఠాత్ మృతి జరుగుతుంది. హార్డ్వేర్ బాగుండొచ్చు కానీ సాఫ్ట్వేర్ లోపభూయిష్టంగా ఉంది అని స్పష్టంగా అన్నారు. ఆరోగ్యం అంటే చర్మం మెరగడం కాదు, అంతర్గతంగా అవయవాలు సమర్ధంగా పనిచేయాలి అని సూచించారు.
ఇక షెఫాలీ జరీవాలా మృతిపై పోలీసులు చేస్తున్న దర్యాప్తులో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలోని ఆమె నివాసంలో పోలీసులు పెద్ద మొత్తంలో మందుల పెట్టెలను గుర్తించారు. వాటిలో గ్లూటాథియోన్, విటమిన్ C ఇంజెక్షన్లు, యాంటీ ఏజింగ్ కోసం ఉపయోగించే ఇతర ఔషధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె గత ఏడు సంవత్సరాలుగా వైద్య పర్యవేక్షణ లేకుండా ఈ చికిత్సలు తీసుకుంటూ వచ్చారని సమాచారం. ప్రతి కణం సహజ జీవిత చక్రానికి విఘాతం కలిగితే గుండెపోటు లాంటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తవచ్చు. కృత్రిమ సౌందర్యం కోసం సహజ శరీర వ్యవస్థతో ఆడుకోవడం ప్రమాదకరం అని అన్నారు. ఈ ఘటన ప్రజల్లో జాగ్రత్త వహించే సందేశాన్ని స్పష్టంగా ఇస్తోంది. యాంటీ ఏజింగ్ చికిత్సల వైపు పరుగెత్తే ముందుగా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Kavya Maran : సోషల్ మీడియా మీమ్స్పై తొలిసారి స్పందించిన కావ్య మారన్