Ketan Agarwal: కేతన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. కేతన్ అగర్వాల్ హత్య వెనుక షాకింగ్ నిజాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 25-06-2026 - 12:41 IST
Published By : Hashtagu Telugu Desk
పూణె యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించడంలో ఆయన సోదరి చూపిన సమయస్ఫూర్తి, ధైర్యం కీలకంగా మారాయి. లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి కేతన్ చనిపోవడంపై.. కాబోయే భార్య ప్రవర్తన, మాటల తీరుపై సోదరి రేకెత్తించిన అనుమానాలే ఈ పక్కా ప్లాన్డ్ మర్డర్ గుట్టును రట్టు చేశాయి.
ప్రమాదం జరిగిన తీరుపై సియా పదే పదే మాటలు మారుస్తూ, పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన కేతన్ సోదరి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పూణె రూరల్ పోలీసులు నిందితురాలైన సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి (22) లను పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు.
జూన్ 18న ట్రెక్కర్స్ స్పాట్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ కేతన్ కాలుజారి పడిపోయాడంటూ సియా మొదట ఆడిన నాటకం, కేతన్ సోదరి నిలదీతతో అడ్డం తిరిగింది. అంత్యక్రియల సమయంలో సియా ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటం, ఘటనపై అడిగిన ప్రతిసారీ ఒక్కో కథనం చెప్పడంతో సోదరి అప్రమత్తమై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా, ప్రియుడు చేతన్ కోసం కాబోయే భర్తను వదిలించుకోవడానికి సియా వేసిన క్రూరమైన స్కెచ్ వెలుగు చూసింది.
బాడీ లాంగ్వేజ్తో సిగ్నల్.. ఆపై ఘాతుకం!
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డైరెక్టర్గా ఉన్న కేతన్తో పెళ్లి ఇష్టం లేని సియా జూన్ 18న ఆయనను కోటలోని ఒక నిర్మానుష్యమైన కొండ అంచుకు తీసుకెళ్లింది. వీరిని అనుసరిస్తూ ప్రియుడు చేతన్ కూడా అక్కడికి చేరుకున్నాడు. కోట అంచున నిల్చున్న సమయంలో.. కేతన్ను తోసేయడానికి ప్రియుడికి సియా ముందే అనుకున్న విధంగా కిందకు కూర్చొని ‘సిగ్నల్’ ఇచ్చింది. వెంటనే చేతన్ వెనుక నుండి వచ్చి కేతన్పై దాడి చేసి, 400 అడుగుల కిందకు నెట్టేసినట్లు పోలీసులు విచారణలో తేల్చారు.
బాలి ట్రిప్ క్యాన్సిల్.. ఇది రెండో ప్రయత్నం!
పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు కేతన్ను చంపడానికి ఇదివరకు కూడా ప్రయత్నించారు. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందే సియా కేతన్ను ఇదే కోటకు తీసుకువచ్చింది, కానీ అప్పుడు ప్లాన్ వర్కవుట్ కాలేదు. అంతేకాకుండా, వీరి పెళ్లి పనులను వాయిదా వేయడానికి, ప్లాన్ చేసిన బాలి ట్రిప్ను క్యాన్సిల్ చేయడానికి సియా.. కేతన్ పాస్పోర్ట్ను కూడా దొంగిలించి దాచిపెట్టినట్లు దర్యాప్తులో తేలింది.
టెక్నాలజీతో దొరికిపోయారు
తీవ్రమైన ఎండకాలంలో కూడా నిందితుడు చేతన్ ముఖం కనిపించకుండా హుడీ వేసుకుని కోట పరిసరాల్లో తిరగడం సీసీటీవీల్లో రికార్డైంది. వీరి మొబైల్ కాల్ డేటా, లొకేషన్ వివరాలు, డిజిటల్ ఆధారాల సాయంతో పోలీసులు ఈ గుట్టును రట్టు చేశారు. ప్రస్తుతం కోర్టు నిందితులిద్దరికీ ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. కేతన్ సోదరి గనుక సమయానికి స్పందించి నిలదీయకపోయుంటే, ఈ దారుణ హత్య కేవలం ఒక ‘సెల్ఫీ ప్రమాదం’గానే ముగిసిపోయేదని పోలీసులు పేర్కొన్నారు.