Radha Gayatri: టెకీ రాధా గాయత్రి చివరి ఆడియో.. వెలుగులోకి కీలక విషయాలు
- Author : Vamsi Chowdary Korata
Date : 22-06-2026 - 2:38 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసుకు సంబంధించి కీలక అంశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఉత్తరాఖండ్లో రాధాగాయత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్లు కేసు చేయగా.. తాజాగా గాయత్రి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో భర్త శ్రీచరణ్పై ముస్సోరి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరో ముఖ్యమైన ఆడియో బయటకు వచ్చింది. రాధాగాయత్రి తన తల్లితో మాట్లాడిన చివరి ఆడియో బయటకొచ్చింది. గాయత్రి తన భర్త గురించి తల్లికి చెబుతూ చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
తన మీద భర్త శ్రీచరణ్కు అనుమానం ఉందని.. తనపై చెడుగా ప్రచారం చేస్తున్నట్లు ఆడియోలో గాయత్రి చెప్పుకొచ్చారు. తన మనుసు విరిగిపోయిందని.. ఒకవేళ తాను ఏదైనా తప్పు చేస్తే నేరుగా అడగమని శ్రీచరణ్ తల్లి, తన అత్తయ్యతో చెప్పిన మాటను ప్రస్తావించారు. ఇకపై తాను భర్తతో మాట్లాడదలుచుకోలేదని.. అందుకే మీతో (గాయత్రి తల్లి)తో మాట్లాడమని చెప్పానన్నారు. ఇంతకాలం అన్ని భరిస్తూ ఓపిక పట్టానని.. తన భర్త పరిధి దాటిపోయారన్నారు. దాదాపు నిమిషం 22 సెకన్ల పాటూ గాయత్రి, ఆమె తల్లి మధ్య సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మరోవైపు రాధా గాయత్రి కుటుంబ సభ్యుల్ని ఏపీ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. రాధా గాయత్రి కేసు గురించి విని బాధపడ్డానని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయత్రి మరణానికి కారణమైన దోషులను శిక్షించాలని.. తమకు న్యాయం చేయాలని పల్లాను కోరారు. పల్లా శ్రీనివాసరావు ఈ కేసు విషయంపై హోం మంత్రి వంగలపూడి అనితతో ఫోన్ చేసి మాట్లాడారు. గాయత్రి హత్య ముస్సోరిలో జరిగిందని.. కాబట్టి కేసు తుది విచారణ బాధ్యత అక్కడి పోలీసులకే ఉంటుందన్నారు.
ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గతేడాది విజయనగరం జిల్లాకు చెందిన రాధా గాయత్రికి విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్తో వివాహమైంది. ఇటీవల వీరిద్దరు హనీమూన్కు వెళ్లారు.. అయితే అక్కడ హోం స్టేలో ఆమె అనుమానాస్పదంగా మరణించారు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టడం, బ్యాగులో జీపీఎస్ ట్రాకర్ అమర్చడం లాంటి భర్త సైకో చేష్టలను తండ్రి సుధాకర్ పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా ముస్సోరి పోలీసులు శ్రీచరణ్పై 103(1) సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేశారు.
శ్రీచరణ్ తన కూతురి పట్ల సైకోలాగే ప్రవర్థించాడని తల్లి సత్యవతి ఆరోపించారు. వారం రోజుల ముందే శ్రీచరణ్ తనను కొంతకాలంగా
ఇబ్బందిపెడుతున్నట్లు తనతో చెప్పిందన్నారు. గాయత్రితో శ్రీచరణ్ సెల్ఫీ దిగి మృతి చెందిన రోజు అర్ధరాత్రి దాటాక పెట్టాడని.. గతంలో ఎప్పుడూ సెల్ఫీ పెట్టలేదని.. ఆ రోజు మాత్రమే పెట్టాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ మరుసటిరోజు ఉదయమే గాయత్రి చనిపోయిందని తమకు తెలిసిందన్నారు.