Sting Energy Drink: స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం
- Author : Vamsi Chowdary Korata
Date : 03-07-2026 - 5:23 IST
Published By : Hashtagu Telugu Desk
మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనల నేపథ్యంలో, ప్రముఖ ఎనర్జీ డ్రింక్ ‘స్టింగ్’ విక్రయాలపై ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్తో పాటు మత్తు పదార్థాలను విక్రయించడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
శుక్రవారం రాష్ట్ర శాసనసభలో బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ అడిగిన ప్రశ్నకు ఆహార, ఔషధ పరిపాలన (ఎఫ్డీఏ) శాఖ మంత్రి నరహరి జిర్వాల్ సమాధానమిచ్చారు. స్టింగ్ వంటి పానీయాల్లో ఉండే కొన్ని పదార్థాలు పాఠశాల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సభకు వివరించారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఎఫ్డీఏ అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.
పాఠశాల ప్రాంగణాలకు 500 మీటర్ల లోపు ఎవరైనా ఈ ఎనర్జీ డ్రింక్స్ లేదా మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే, వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి జిర్వాల్ హెచ్చరించారు. మరోవైపు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే ఆరోగ్య నష్టాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.
ఈ చర్చ సందర్భంలో పలువురు ఎమ్మెల్యేలు సైతం చిన్నారులకు ఇటువంటి పానీయాలు అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎనర్జీ డ్రింక్స్లో ఉండే అధిక కెఫిన్, చక్కెర నిష్పత్తి విద్యార్థుల నిద్ర, ప్రవర్తన మరియు ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆరోగ్య నిపుణులు చాలాకాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది.