Krishna Janmabhoomi : 100 ఇళ్లు కూల్చివేత.. శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు స్టే
Krishna Janmabhoomi : ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్వహిస్తున్న బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది.
- Author : Pasha
Date : 16-08-2023 - 3:34 IST
Published By : Hashtagu Telugu Desk
Krishna Janmabhoomi : ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ నిర్వహిస్తున్న బుల్డోజర్ చర్యపై సుప్రీంకోర్టు బుధవారం స్టే విధించింది. 10 రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని, ఈవిషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రైల్వే శాఖను ఆదేశించింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖలకు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Also read : Naga Chaitanya : పాపం చైతు..సమంత & విజయ్ ని ఆలా చూసి ఎలా తట్టుకుంటున్నాడో..?
రైల్వే శాఖ బుల్డోజర్ చర్య వల్ల ఇళ్ళు కోల్పోతున్న దాదాపు 200 కుటుంబాల తరఫున యాకూబ్ షా అనే వ్యక్తి(Krishna Janmabhoomi) సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. “దాదాపు 3వేల మంది జీవితాలతో ముడిపడిన 200 ఇళ్లను కూల్చివేసేందుకు బుల్డోజర్ చర్య చేపడుతున్నారు. ఇప్పటికే 100 ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మరో 80 ఇళ్లు మిగిలి ఉన్నాయి. స్టే ఇవ్వడం ఆలస్యమైతే ఆ ఇళ్లనూ కూల్చేస్తారు. మాకు నివసించడానికి వేరే స్థలం లేదు. 100 ఏళ్లకుపైగా మేం అక్కడే నివసిస్తున్నాం” అని పిటిషనర్ యాకూబ్ షా తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంతోసేన్ కోర్టులో వాదించారు. ఉత్తరప్రదేశ్లో కోర్టులు మూతపడిన రోజున(ఆగస్టు 14న) 100 ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేశారని ఆరోపించారు.
రైల్వే లైన్ కోసం..
వందేభారత్ లాంటి అధునాతన రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు 21 కి.మీల స్ట్రెచ్ను నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కృష్ణ జన్మభూమి వెనుకవైపు ఉన్న నయీ బస్తీలో ఇప్పటివరకు 100కు పైగా ఇళ్లను కూల్చివేశారు.
Also read : TDP-BJP Alliance: టీడీపీ ఎన్డీయే పొత్తుపై బాబు క్లారిటీ