పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తత.. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం?!
ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది.
- Author : Gopichand
Date : 13-03-2026 - 6:03 IST
Published By : Hashtagu Telugu Desk
Iran War Impact: పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థపై కూడా కనిపిస్తోంది. చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ అనిశ్చితి కారణంగా భారత కరెన్సీపై ఒత్తిడి పెరిగింది. రూపాయి విలువ నిరంతరం క్షీణిస్తూ డాలర్తో పోలిస్తే దాదాపు 93 రూపాయలకు చేరువలో ఉంది. ఇది ఆర్థిక అనిశ్చితికి దారితీస్తోంది. మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం కూడా గత పది నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సంక్షోభం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే దాని ప్రభావం నేరుగా సామాన్యుల జేబుపై పడుతుంది. ప్రస్తుతం వినియోగదారులపై పెద్దగా ప్రభావం కనిపించకపోయినా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇంధనం, ప్రయాణం, రోజువారీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
Also Read: అమెరికా యుద్ధనౌకపై దాడి చేశామన్న ఇరాన్.. ఖండించిన అమెరికా!
భారత్పై పడే అవకాశం ఉన్న ప్రభావాలు
ఇంధనం- గ్యాస్ ధరలు పెరగవచ్చు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 100 డాలర్ల కంటే ఎక్కువ ఉంటే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసరాల ధరలు కూడా భారమవుతాయి.
దిగుమతులు ప్రియం కావచ్చు
భారత్ తన అవసరాల కోసం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. రూపాయి బలహీనపడటం వల్ల ఆహార పదార్థాలు, పారిశ్రామిక విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు పెరగవచ్చు.
విదేశీ ప్రయాణం, చదువు ఖరీదు కావచ్చు
రూపాయి విలువ తగ్గడం వల్ల విదేశీ ప్రయాణాలు, విదేశీ యూనివర్సిటీల ఫీజులు, అంతర్జాతీయ ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల వంటి సేవలకు మునుపటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.
EMIలపై ప్రభావం పడవచ్చు
ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల తగ్గింపు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో లోన్ EMIలు తగ్గే అవకాశం తక్కువగా ఉండటమే కాకుండా ఎక్కువ కాలం అధిక వడ్డీ రేట్ల ఒత్తిడి కొనసాగవచ్చు.