Target PoK : పీఓకేపైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లే లక్ష్యం
పీఓకేలోని(Target PoK) అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ ఆర్మీ ఖాళీ చేయించినట్లు సమాచారం.
- By Pasha Published Date - 01:03 PM, Tue - 29 April 25

Target PoK : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత సైన్యం పూర్తి ఫోకస్ను పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)పై పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాగైనా పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని భారత్ భావిస్తున్నట్లు సమాచారం. ప్రత్యేకించి పీఓకేలోని కర్నా, కేరన్, మాచిల్ సెక్టార్లలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేస్తుందనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఆయా సెక్టార్లకు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లొద్దని జమ్మూకశ్మీరు ప్రజలకు భారత సైన్యం అడ్వైజరీ జారీ చేసిందని అంటున్నారు. పీఓకేపై ఆపరేషన్ చేపట్టనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కశ్మీర్వ్యాప్తంగా ఉన్న 87 టూరిస్టు కేంద్రాల్లో 48 కేంద్రాలను భారత సర్కారు మూసివేయించింది. కశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్ దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులను మోహరించారు.
Also Read :WhatsApp Update : యాప్తో పనిలేదు.. ఇక వాట్సాప్ వెబ్ నుంచీ కాల్స్
పీఓకేలోని ఉగ్ర లాంచ్ప్యాడ్లే టార్గెట్
మరోవైపు పాకిస్తాన్ కూడా ఈవిషయాన్ని ఇప్పటికే పసిగట్టింది. పీఓకేలోని(Target PoK) అనేక ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను పాక్ ఆర్మీ ఖాళీ చేయించినట్లు సమాచారం. భారత సైన్యం దాడుల నుంచి కాపాడుకునేలా ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, భూగర్భ బంకర్లలోకి తరలించారని అంటున్నారు. పీఓకేలోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుటా, కోట్లి, ఖుయిరట్టా, మంధర్, నికైల్, చమన్కోట్, జంకోట్ ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను రహస్య ప్రదేశాలకు పాక్ ఆర్మీ పంపింది. పీఓకేలోని 42 ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను భారత్ గుర్తించింది. వాటిలోనే పాక్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి, జమ్మూకశ్మీరులోకి పంపి ఉగ్రదాడులు చేయిస్తున్నారు. భారత నిఘా వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం పీఓకే సరిహద్దుల్లో దాదాపు 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే తైబా లాంటి ఉగ్రవాద సంస్థలు వీళ్లను పీఓకేలోకి పంపాయి. ఈ ఉగ్రమూకలను ఏరిపారేయడమే లక్ష్యంగా భారత్ ప్రత్యేక ఆపరేషన్ను చేపట్టే అవకాశం ఉంది.
Also Read :Vanshika Saini : కెనడాలో ఆప్ నేత కుమార్తె దారుణ హత్య
భారత్ అమ్ములపొదిలో ఆధునిక ఆయుధాలు
2016లో పాక్ ఆక్రమిత కశ్మీరుపై సర్జికల్ స్ట్రైక్ చేసిన సమయంలో భారత్ వద్ద పాత తరం యుద్ధ విమానాలే ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత్ వద్ద 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిని హర్యానాలోని అంబాలా, పశ్చిమ బెంగాల్లోని హాషిమారా వైమానిక స్థావరాల్లో మోహరించారు. ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థలు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. వీటిని పాకిస్తాన్, చైనా బార్డర్లలో అందుబాటులో ఉంచారు. 2022 నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ అనే విమాన వాహక నౌకను భారత్ వినియోగిస్తోంది. ఇందులో ఎన్నో యుద్ధ విమానాలు, డ్రోన్లు, జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, డెస్ట్రాయర్లు, మిస్సైళ్లు ఉంటాయి. పాకిస్తాన్లోని కరాచీ, గ్వాదర్ ఓడరేవులను చుట్టుముట్టేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ ఉపయోగపడుతుంది.