Manish Sisodia : పార్టీ మారకుంటే చంపేస్తామన్నారు.. మనీశ్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో సిసోడియా(Manish Sisodia) ఈ వ్యాఖ్యలు చేశారు.
- Author : Pasha
Date : 22-09-2024 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
Manish Sisodia : తిహార్ జైలులో ఉండగా కొందరు తనకు వార్నింగ్స్ ఇచ్చారని.. పార్టీ మారాలని అల్టిమేటం ఇచ్చారని ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఆరోపించారు. ఒకవేళ పార్టీ మారకుంటే చంపేస్తామని తనను బెదిరించారని ఆయన వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనతాకీ అదాలత్’ కార్యక్రమంలో సిసోడియా(Manish Sisodia) ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :Iran Blast : బొగ్గుగనిలో భారీ పేలుడు.. 30 మంది కార్మికులు మృతి
‘‘ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాలే నా పేరు చెప్పి ఇరికించారని కొందరు జైల్లో చెప్పేవారు. కోర్టు ఎదుట కేజ్రీవాల్ గురించి చెబితే నన్ను కాపాడుతామని మభ్యపెట్టే వారు. బీజేపీ వాళ్లు నన్ను అన్ని విధాలుగా బెదిరించారు. అయినా నేను వారికి లొంగలేదు’’ అని మనీశ్ సిసోడియా తెలిపారు.
Also Read :Indian Antiquities : అమెరికా పెద్ద మనసు.. 297 భారత పురాతన వస్తువులు బ్యాక్
‘‘బీజేపీ వాళ్లు రాముడి నుంచి లక్ష్మణుడిని వేరుచేయాలని కుట్రపన్నారు. కానీ అది జరగలేదు. ఏ రావణుడు కూడా రాముడి నుంచి లక్ష్మణుడిని వేరు చేయలేడు’’ అని మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. ‘‘నా వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకం. 2002 సంవత్సరం నాటికి నేనొక జర్నలిస్టును. అప్పట్లో రూ.5 లక్షలతో ఒక ఫ్లాట్ కొంటే దాన్ని కూడా జప్తు చేశారు. నా అకౌంటులో కేవలం రూ.10 లక్షలు ఉంటే వాటినీ సీజ్ చేశారు. నా కొడుకు చదువుల ఖర్చుల కోసం ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఈడీ నా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది’’ అని మనీశ్ సిసోడియా వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మనీశ్ సిసోడియా జైలు నుంచి విడుదలయ్యే వరకు ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ కొనసాగారు. అయితే సిసోడియా విడుదల కాగానే.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తేనే తాను సీఎంగా,డిప్యూటీ సీఎంగా సిసోడియా పగ్గాలు చేపడతామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.