Indian Antiquities : అమెరికా పెద్ద మనసు.. 297 భారత పురాతన వస్తువులు బ్యాక్
భారత పురాతన వస్తువులు(Indian Antiquities) తిరిగి ఇచ్చేందుకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడం గొప్ప విషయమన్నారు.
- Author : Pasha
Date : 22-09-2024 - 12:46 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Antiquities : మన దేశంనుంచి ఎన్నో కళాఖండాలు అక్రమ మార్గాల్లో విదేశాలకు తరలిపోయాయి. వాటిలో ఎన్నో విలువైన సాంస్కృతిక కళాత్మక వస్తువులు కూడా ఉన్నాయి. వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నంలో భారత ప్రభుత్వం ఉంది. ఈక్రమంలోనే అమెరికా పెద్ద మనసుతో ప్రవర్తించింది. భారత్ నుంచి తమ దేశానికి అక్రమంగా చేరిన 297 పురాతన కళాఖండాలను వెనక్కి ఇచ్చేందుకు అమెరికా రెడీ అయింది. భారత్కు తిరిగి అందించనున్న 297 కళాఖండాలతో ఏర్పాటు చేసిన స్టాల్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందర్శించారు. ఈసందర్భంగా జో బైడెన్కు ప్రధాని మోడీ థ్యాంక్స్ చెప్పారు. సాంస్కృతిక కళాత్మక వస్తువులను భారత్కు తిరిగి ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. భారత పురాతన వస్తువులు(Indian Antiquities) తిరిగి ఇచ్చేందుకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదరడం గొప్ప విషయమన్నారు. ఈమేరకు వివరాలతో ప్రధాని మోడీ ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు.
Also Read :Sri Lanka Elections : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే ముందంజ.. ఆయన ఎవరు ?
సాంస్కృతిక వస్తువులను భారత్కు తిరిగి అప్పగించే అంశంపై ఈ ఏడాది జులైలో ఢిల్లీలో జరిగిన 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో అమెరికా- భారత్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్ నుంచి అమెరికాకు కళాఖండాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడం, భారత సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో సహకరించడం అనేవి ఈ ఒప్పందంలోని కీలక అంశాలు. ప్రపంచదేశాలన్నీ ఇతర దేశాల సాంస్కృతిక సంపదను తిరిగి వాటికి అప్పగించాలని 1970 సంవత్సరంలోనే యునెస్కో ఒక కీలక తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రాతిపదికపైనే భారత్ – అమెరికా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరింది.
Also Read :PM Modi Gifts : జో బైడెన్, జిల్ బైడెన్లకు ప్రధాని మోడీ ప్రత్యేక గిఫ్ట్స్ ఇవే..
మన దేశం నుంచి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలకు ఎన్నో పురాతన వస్తువులు అక్రమంగా తరలిపోయాయి. వీటిలో 578 పురాతన వస్తువులను ఇప్పటివరకు అమెరికా అప్పగించింది. అంతకుముందు 2004- 2013 మధ్య కాలంలో భారత్కు ఒక్క వస్తువు మాత్రమే అమెరికా నుంచి వెనక్కి వచ్చింది. అంటే కేంద్రంలో మోడీ సర్కారు ఏర్పడిన తర్వాత పురాతన వస్తువులను తిరిగి దేశానికి తీసుకొచ్చే కసరత్తు వేగవంతం అయింది.