Demands Dismissal Of AAP Govt: కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా బీజేపీ ప్రణాళికలు
Demands Dismissal Of AAP Govt: కాగ్ 11 నివేదికలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించడం లేదని విజేంద్ర గుప్తా అన్నారు. ఎక్సైజ్ కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి సహా ఇతర అవినీతి ఆరోపణలను కూడా ఎమ్మెల్యేలు మెమోరాండంలో ప్రస్తావించారు.
- By Praveen Aluthuru Published Date - 03:45 PM, Tue - 10 September 24

Demands Dismissal Of AAP Govt: ఎక్సైజ్ పాలసీలో జరిగిన కుంభకోణంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal: జైలులో ఉండడంతో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంది. అయితే ఢిల్లీ ప్రభుత్వాన్ని సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ పదేపదే పునరుద్ఘాటించింది. కాగా ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Murmu) హోం మంత్రిత్వ శాఖకు లేఖ పంపారు. అంతకుముందు ఆగస్టు 30న ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేంద్ర గుప్తా నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమయ్యారు. ఢిల్లీలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తిందని ఆరోపిస్తూ.. ఢిల్లీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో పరిపాలనా వ్యవస్థపై బీజేపీ కంప్లైంట్:
ఢిల్లీలో పరిపాలనా వ్యవస్థ స్తంభించిపోయింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్లో నాలుగు నెలలకు పైగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉన్నారు. జైలులో ఉన్నప్పటికీ రాజీనామా చేయడానికి నిరాకరించారు. దీంతో ఢిల్లీలో సంక్షోభం ఏర్పడింది. ఇదే క్రమంలో బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే దిశగా పావులు కదుపుతుంది. అయితే తాజాగా రాష్ట్రపతి స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
బిజెపి నేతలు మాట్లాడుతూ.. “ఢిల్లీలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. ముఖ్యమైన ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోంది. దీని కారణంగా అవసరమైన సేవలు ప్రభావితం అవుతున్నాయి.ఆప్ ప్రభుత్వం రాజ్యాంగ నియమాలు మరియు సంప్రదాయాలను ఉల్లంఘిస్తోంది. ఢిల్లీ ఫైనాన్స్ కమిషన్ ఏప్రిల్ 2021 నుండి పెండింగ్లో ఉంది. దీని కారణంగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్కు అవసరానికి అనుగుణంగా నిధులు రావడం లేదు” అని ఆరోపిస్తున్నారు.
రాజధానిలో పాలనా వ్యవస్థ దిగజారుతోంది – బీజేపీ
కాగ్ 11 నివేదికలను ఢిల్లీ ప్రభుత్వం అసెంబ్లీలో సమర్పించడం లేదని విజేంద్ర గుప్తా అన్నారు. ఎక్సైజ్ కుంభకోణం, ఢిల్లీ జల్ బోర్డులో అవినీతి సహా ఇతర అవినీతి ఆరోపణలను కూడా ఎమ్మెల్యేలు మెమోరాండంలో ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాల అమలును ఢిల్లీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అడ్డుకుంటున్నదని ఆరోపించారు. రాజధానిలో పాలన దిగజారుతున్నందున, ఢిల్లీ పౌరులకు అందించే సౌకర్యాలకు అంతరాయం కలుగుతోంది అని బీజేపీ ఎమ్మెల్యేలు అన్నారు.
Also Read: Haryana Election : 21 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల