Amit Shah: కాంగ్రెస్ దళిత వ్యతిరేక పార్టీ: అమిత్షా
Haryana: హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు.
- By Latha Suma Published Date - 06:45 PM, Mon - 23 September 24

Amit Shah election campaign: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా… కేంద్ర హోం మంత్రి అమిత్షా సోమవారం హర్యానాలోని ఫతేహాబాద్లో జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ర్యాలీలో ప్రసంగించిన ఆయన కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. దళిత నేతల్ని అగౌరవపరిచిన కాంగ్రెస్ పార్టీ… దళిత వ్యతిరేక పార్టీ అని అమిత్ షా అభివర్ణించారు. రాహుల్ గాంధీ ఇటీవల అమెరికాలో అభివృద్ధి జరిగిన తర్వాత రిజర్వేషన్లు అవసరం లేదు. వాటిని తొలగిస్తాం అని అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఆయన మాటలే చెబుతున్నాయి. కేవలం మోడీజీ మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబిసీలకు చెందిన రిజర్వేషన్లను కాపాడగలరని అమిత్ షా చెప్పుకొచ్చారు.
‘రాహుల్ బాబా.. మీ మూడోతరం వచ్చినా ఆర్టికల్ 370 తిరిగి రాదు..
జమ్మూ కాశ్మీర్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీతోపాటు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి)లు ఆర్టికల్ 370ని వెనక్కి తీసుకొస్తామని, ఉగ్రవాదులందరినీ విడుదల చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్కి నేను చెప్పదలచుకున్నది ఒక్కటే.. ‘రాహుల్ బాబా మీకే కాదు.. మీ మూడోతరం వచ్చినా ఆర్టికల్ 370 తిరిగి రాదని చెప్పాలనుకుంటున్నాను. ఆర్టికల్ 370 ఇప్పుడు చరిత్రగా మారింది. మీ తాత కాలంలో ఆర్టికల్ 370 అనేది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఆ క్వశ్చన్మార్క్ను నరేంద్ర మోడీ తొలగించేశారు. అదిక తిరిగిరాదు’ అని షా వ్యాఖ్యానించారు.
రాహుల్గాంధీ యువతను తప్పుదారి పటిస్తున్నారు..
హర్యానా ఎన్నికలకు సంబంధించి మాట్లాడుతూ.. ‘బీజేపీ పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణగా హర్యానానే నిలుస్తుంది. గతంలో హర్యానాలో రెండు వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తూ పోతుండేవి. ఒక పార్టీ అధికారంలోకి రాగానే..అవినీతి పెరిగిపోయింది. మరో పార్టీ అధికారంలోకి రాగానే గూండాయిజం పెరిగింది. రెండు పార్టీల్లోనూ ఆశ్రిత పక్షపాతం, కులతత్వం తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి సమయంలోనే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకముందు ఉద్యోగం పొందాలంటే కచ్చితంగా ముడుపులు ముట్టజెప్పాల్సిందే. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి డబ్బును ఆశించకుండా పారదర్శకతతో వేలాదిమంది యువకులను రిక్రూట్ చేసుకుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అగ్నివీర్ పథకం విషయంలో రాహుల్గాంధీ యువతను తప్పుదారి పటిస్తున్నారని షా విమర్శించారు.