ఎంత నీరు తాగినా ఇంకా దాహమేస్తోందా?
మన శరీరంలో సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు తగినంత లేకపోతే నీరు కణాల లోపలికి వెళ్లలేదు. ఫలితంగా కణాలు ఎప్పుడూ దప్పికతోనే ఉంటాయి.
- Author : Gopi
Date : 21-04-2026 - 1:45 IST
Published By : Hashtagu Telugu Desk
Dehydration: సాధారణంగా శరీరంలో నీటి కొరత ఉంటే తగినంత నీరు తాగాలని అందరూ చెబుతుంటారు. కానీ కొందరు రోజంతా లీటర్ల కొద్దీ నీరు తాగుతున్నా.. ఇంకా దాహంగా ఉండటం, నీరసం లేదా చర్మం పొడిబారడం వంటి డీహైడ్రేషన్ లక్షణాలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో వివరిస్తూ నిపుణులు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మనం తాగే నీరు కేవలం కడుపులోకి వెళ్తే సరిపోదని, అది మన శరీరంలోని కణాలకు అందాలని చెబుతున్నారు. ఒకవేళ శరీరం ఆ నీటిని గ్రహించకుండా నేరుగా మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంటే.. మీరు రోజుకు 6 నుండి 7 లీటర్ల నీరు తాగినా ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు.
నీరు తాగినా డీహైడ్రేషన్ రావడానికి ప్రధాన కారణాలు
ఎలక్ట్రోలైట్స్ లోపం: మన శరీరంలో సోడియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు తగినంత లేకపోతే నీరు కణాల లోపలికి వెళ్లలేదు. ఫలితంగా కణాలు ఎప్పుడూ దప్పికతోనే ఉంటాయి.
కాఫీ, టీల అతి వినియోగం: రోజంతా ఎక్కువగా టీ లేదా కాఫీ తాగే వారిలో ‘డైయూరిటిక్ ఎఫెక్ట్’ వల్ల నీరు శరీరంలో నిలవకుండా బయటకు పోతుంది. దాంతో పాటు ముఖ్యమైన ఖనిజాలు కూడా ఖర్చైపోతాయి.
Also Read: పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవేదన
నీటిని గటగటా తాగడం: చాలామంది నీటిని నిలబడి ఒకేసారి వేగంగా తాగేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి ఆ నీటిని శోషించుకునే సమయం దొరకదు. అది నేరుగా మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లిపోతుంది.
చక్కెర- హార్మోన్లు: మితిమీరిన తీపి పదార్థాలు తినడం లేదా డయాబెటిస్ ఉండటం వల్ల కణాల నుండి నీరు బయటకు వచ్చేస్తుంది. అలాగే హార్మోన్ల అసమతుల్యత కూడా శరీరంలో నీరు నిలవకుండా చేస్తుంది.
నీటి కొరతను నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
శరీరంలో నీరు సరిగ్గా నిలవకపోవడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కండరాల నొప్పులు, తీవ్రమైన అలసట, యూరిన్ ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. తీవ్రమైన సందర్భాల్లో రక్తపోటు తగ్గిపోవడం, గుండె వేగం పెరగడం, మతిమరుపు లేదా గందరగోళం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తవచ్చు. చర్మం పొడిబారి పగుళ్లు రావడం, మలబద్ధకం వంటి సమస్యలు డీహైడ్రేషన్కు ప్రధాన సంకేతాలు.