Tambulam: తాంబూలం ఎందుకు ఇస్తారు? ఏ సందర్భాల్లో ఇస్తారు? వాటి ప్రత్యేకత ఏంటి?
- Author : Vamsi Chowdary Korata
Date : 06-07-2026 - 5:55 IST
Published By : Hashtagu Telugu Desk
తమలపాకులు, వక్కలు, సున్నం, సుగంధ ద్రవ్యాలు కలిసి ఇచ్చేదే తాంబూలం. జీర్ణశక్తితోపాటు రోగనిరోధక శక్తిని పెంచేందుకు రకరకాల తాంబూలాలు కడుతుంటారు. సాధారణంగా తాంబూలం అనేది తమలపాకులతోనే ఉంటుంది. కానీ పలు సందర్భాల్లో మామిడి, మారేడు ఆకులతో ఇచ్చే తాంబూలాలు కూడా ఉన్నాయి. కవులను గ్రంథరచనకు ప్రోత్సహిస్తూ మహారాజులు కర్పూర తాంబూలాలు, బంగారు తాంబూలాలు ఇచ్చేవారని తెలుసు. ఆరోగ్యం రక్షణ కోసం తాంబూలంలో జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, కస్తూరి ఇలా ఎన్నో సుగంధ ద్రవ్యాలను వినియోగిస్తుంటారు.
ఇక పెళ్లి, నూతన గృహప్రవేశం వంటి శుభకార్యాల్లో విందుభోజనం అనంతరం తాంబూలం అందిస్తుంటారు. వివాహ నిర్ణయ సందర్భాన్ని పురస్కరించుకుని ‘నిశ్చయ తాంబూలాలు’ అని పిలవడాన్ని బట్టి చూస్తుంటే మన సంప్రదాయంలో తాంబూలానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. షోడశోపచార పూజా విధిలోనూ దైవానికి తాంబూలం సమర్పిస్తారు. ఎవరైనా పెద్దలను, గురువులను కలిసే సమయంలోనూ తాంబూలం ఇస్తుంటారు. అయితే ప్రమాదాలపాలైన వారిని పలకరించే సందర్భాల్లో తాంబూలం ఇవ్వకూడదు. ఎందుకంటే రకరకాల ఉత్ప్రేరకాలతో సేవించే తాంబూలం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.