తెలంగాణలో మన శంకర వరప్రసాద్గారు టికెట్ ధరల పెంపు
- Author : Vamsi Chowdary Korata
Date : 10-01-2026 - 1:07 IST
Published By : Hashtagu Telugu Desk
Mana Shankara Varaprasad Garu మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నెల 11న ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. అలాగే, జనవరి 12 నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయంతో థియేటర్లలో భారీ కలెక్షన్లపై అంచనాలు పెరిగాయి.
తెలుగు సినీ పరిశ్రమకి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే థియేటర్లలో కనిపించే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నాలుగు దశాబ్దాలకు పైగా కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్లు అందించిన చిరంజీవి, తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి చేస్తున్న సినిమా ‘ మన శంకర వరప్రసాద్ గారు ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్తో ఈ సినిమా రూపొందుతున్నట్టు ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ స్పష్టత ఇచ్చింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి , చిరంజీవి ఇమేజ్కు తగ్గ కథ, వినోదంతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా, కేథరిన్ థ్రెసా కీలక పాత్రలో కనిపించనుంది. ఫుల్ ఎంటర్టైనర్ టోన్తో పాటు ఎమోషన్స్, హాస్యం, మాస్ సీన్స్ సమపాళ్లలో ఉండేలా సినిమాని తెరకెక్కించినట్లు అప్డేట్స్ చూస్తుంటేనే తెలుస్తోంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు, ట్రేడ్ వర్గాల్లోనూ భారీ బిజినెస్ అంచనాలు ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి టికెట్ రేట్లను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 11న జరిగే ప్రీమియర్ షోల కోసం ఒక్కో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు, సినిమా విడుదలైన తర్వాత వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సింగిల్ స్క్రీన్లలో జీఎస్టీతో కలిపి రూ.50 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.100 వరకు అదనంగా వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
టికెట్ ధరల పెంపు అంశంపై న్యాయపరమైన వివాదం కొనసాగుతుండటంతో నిర్మాతలు ఇటీవల హైకోర్టులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ నిర్మాతలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమా భారీ బడ్జెట్తో తెరకెక్కిందని, పెరిగిన నిర్మాణ వ్యయాలు, ప్రమోషనల్ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం అవసరమని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వానికి తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. దీంతో ప్రభుత్వం పరిస్థితిని సమీక్షించి, నిర్దిష్ట కాలానికి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలు, తొలి వారం కలెక్షన్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు అభిమానులు చిరంజీవి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నా, మరోవైపు టికెట్ ధరల పెంపుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ‘ది రాజా సాబ్’ చిత్రానికి సంబంధించి టిక్కెట్ల రేట్ల పెంపు జీవోను హైకోర్టు కొట్టివేయగా.. తాజాగా‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకి టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం తెలంగాణలో హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు.