Ram Charan: ‘పెద్ది’ గ్లింప్స్ వచ్చేసింది.. కుస్తీ వీరుడిగా రామ్ చరణ్ మాస్ అవతార్
- Author : Vamsi Chowdary Korata
Date : 27-03-2026 - 10:32 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ఆయన కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ నుంచి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. రామ్ చరణ్ను మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, మాస్ అవతారంలో చూపించి దర్శకుడు బుచ్చిబాబు సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు.
ఈ గ్లింప్స్ ప్రారంభంలో వినిపించే ‘కుస్తీ అంటే బ్యాట్తో బంతికి ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో చావుకి ఎదురెళ్లే ఆట’ అనే సంభాషణ, ఇది కేవలం క్రీడా నేపథ్య చిత్రం కాదని, ఓ యోధుడి జీవన్మరణ పోరాటమని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. ఈ పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కుస్తీ, క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ డ్రామాలో చరణ్ పాత్ర ఎంతో శక్తివంతంగా ఉండబోతున్నట్టు ఈ గ్లింప్స్ సూచిస్తుంది.
విజువల్స్లో రామ్ చరణ్ మేకోవర్ అద్భుతమనే చెప్పాలి. కండలు తిరిగిన శరీరంతో, ఒంటి నిండా మట్టి పూసుకుని, చేతిలో గద పట్టుకుని నడుస్తున్న చరణ్ను చూస్తుంటే, ‘రంగస్థలం’లోని చిట్టిబాబును మించిన మాస్ అవతార్ అనిపిస్తోంది. ఆయన కళ్లలో కనిపించే పౌరుషం, గంభీరమైన నడక గ్లింప్స్కే హైలైట్గా నిలిచాయి. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్కు ప్రాణం పోసింది. 1980ల నాటి గ్రామీణ వాతావరణాన్ని, కుస్తీ బరిలోని వేడిని తన సంగీతంతో ప్రేక్షకులకు అనుభూతిని కలిగించారు.
ప్రస్తుతం ఈ గ్లింప్స్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్లో దూసుకుపోతోంది. అభిమానులు చరణ్ కెరీర్లో ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్ర బృందం ప్రకటించిన ప్రకారం ‘పెద్ది’ ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.