GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా తగ్గనున్న ధరలు!
జీఎస్టీ రేట్ల మార్పు డైరీ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
- By Gopichand Published Date - 10:44 PM, Sat - 6 September 25

GST Rates: కేంద్ర ప్రభుత్వం 2017 తర్వాత వస్తువులు, సేవల పన్ను (GST Rates) రేట్లలో నిర్మాణాత్మక మార్పులు చేసింది. నాలుగు GST రేట్ల వ్యవస్థను రద్దు చేసి, రెండు రేట్ల వ్యవస్థను అమలు చేసింది. దీని వల్ల డైరీ రంగానికి అత్యంత ప్రయోజనం చేకూరుతుంది. భారతదేశంలో డైరీ రంగం విలువ సుమారు రూ. 19 లక్షల కోట్లు. జీఎస్టీ రేట్లు తగ్గించడం వల్ల పాల ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. దీనితో వినియోగం, డిమాండ్ పెరుగుతాయి. తద్వారా డైరీ రంగం వృద్ధి చెందుతుంది.
కౌన్సిల్ మీటింగ్లో తీర్మానానికి ఆమోదం
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. 56వ జీఎస్టీ కౌన్సిల్ పాలు, పాల ఉత్పత్తులపై పన్ను తగ్గించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. జీఎస్టీలో ఈ మార్పులు అత్యంత విస్తృతమైన సంస్కరణల్లో ఒకటి. ఇది చాలా పాల ఉత్పత్తులపై 5 శాతం పన్ను రేటును అమలు చేస్తుంది. కొత్త సవరించిన పన్ను విధానం సెప్టెంబర్ 22, 2025 నుంచి అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం పాల ఉత్పత్తులపై కేవలం 5 శాతం జీఎస్టీ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్లు!
పాల ఉత్పత్తులపై ఇప్పుడు ఇలా జీఎస్టీ ఉంటుంది
అధికారిక ప్రకటన ప్రకారం.. అల్ట్రా-హై టెంపరేచర్ (UHT) పాలపై జీఎస్టీ రేటును 5 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. పనీర్/చెనా (ప్యాకేజ్డ్, లేబుల్ చేసినవి)పై జీఎస్టీని 5 శాతం నుంచి సున్నాకు తగ్గించారు. వెన్న, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు, జున్ను, చిక్కటి పాలు, పాలు ఆధారిత పానీయాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. ఐస్క్రీమ్పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. పాల డబ్బాలపై 12 శాతం కాకుండా ఇప్పుడు 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది.
రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం
జీఎస్టీ రేట్ల మార్పు డైరీ రంగానికి ప్రోత్సాహం అందిస్తుంది. దీనివల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. పన్ను రేట్లు మార్చడం వల్ల 8 కోట్లకు పైగా గ్రామీణ రైతు కుటుంబాలకు నేరుగా లాభం చేకూరుతుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, భూమిలేని కార్మికులకు తమ జీవనోపాధి కోసం పశువులను పెంచుకునే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశం. 2023-24లో భారతదేశంలో పాల ఉత్పత్తి 239 మిలియన్ టన్నులు. ఇది ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 24 శాతం. తాజా జీఎస్టీ సంస్కరణలు పాల ఉత్పాదకత, పోటీతత్వాన్ని పెంచి, స్థిరమైన జీవనోపాధిని కల్పిస్తాయి.