GST Reforms: జీఎస్టీ 2.0.. మొదటిరోజు అమ్మకాలు ఏ రేంజ్లో జరిగాయంటే?
థామ్సన్, కోడక్, బ్లూపన్క్ట్ వంటి గ్లోబల్ బ్రాండ్ల లైసెన్స్లు ఉన్న టీవీ తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 మొదటి రోజునే అమ్మకాల్లో 30 నుండి 35% పెరుగుదల కనిపించిందని తెలిపారు.
- By Gopichand Published Date - 07:57 PM, Tue - 23 September 25

GST Reforms: భారతదేశంలో సోమవారం నుండి జీఎస్టీ 2.0 సంస్కరణలు (GST Reforms) అమలులోకి రావడంతో వినియోగదారులలో అపూర్వమైన ఉత్సాహం కనిపించింది. వస్తువుల ధరలు తగ్గడం, నవరాత్రి పండుగ సందర్భంగా అదనపు డిస్కౌంట్లు లభించడంతో ప్రజలు దుకాణాలకు పోటెత్తారు. దాదాపు అన్ని రంగాల్లోనూ కొనుగోళ్లు భారీగా పెరిగాయి. సోమవారం రోజున ఎయిర్ కండిషనర్లు (AC), టీవీ సెట్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. జీఎస్టీ సంస్కరణల కింద నిత్యావసరాలు, ఆహార పదార్థాల ధరలు కూడా తగ్గడంతో కిరాణా దుకాణాల వద్ద కూడా ప్రజలు అధిక సంఖ్యలో కనిపించారు. కొన్ని చోట్ల సవరించిన ఎంఆర్పి ధరల విషయంలో వినియోగదారులు, వ్యాపారుల మధ్య వాగ్వాదాలు కూడా జరిగాయి.
ఈ-కామర్స్ కంపెనీలకు లాభాల పంట
జీఎస్టీ 2.0 లో అనేక వస్తువుల ధరలు తగ్గడం వల్ల పండుగ సీజన్లో వినియోగదారుల ఖర్చు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ-కామర్స్ కంపెనీల వార్షిక ఆదాయంలో సింహభాగం పండుగ సీజన్ అమ్మకాల నుంచే వస్తుంది. జీఎస్టీ సంస్కరణల కారణంగా ఈ పండుగ సీజన్ అమ్మకాల్లో 15-20 శాతం వరకు పెరుగుదల ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ప్రీమియం ఎలక్ట్రానిక్స్ వస్తువులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఫ్లిప్కార్ట్ గ్రోత్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ప్రతీక్ శెట్టి మాట్లాడుతూ.. “జీఎస్టీ సంస్కరణలను మేము ఒక విప్లవాత్మక మార్పుగా చూస్తున్నాము. ఇది వినియోగాన్ని ప్రోత్సహించి, ఈ పండుగ సీజన్లో వినియోగదారులకు సరైన ధరకే వస్తువులను అందుబాటులోకి తెస్తుంది” అని అన్నారు.
Also Read: CM Revanth: మేడారం అభివృద్ధి మనందరి భాగ్యం, 18 సార్లు అమ్మవార్లను దర్శించుకున్నాను: సీఎం రేవంత్
దుకాణాల వద్ద రద్దీ
సోమవారం పని వారంలో మొదటి రోజు అయినప్పటికీ ఆటోమొబైల్ షోరూమ్ల నుండి ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల వరకు ఎక్కడ చూసినా వినియోగదారుల రద్దీ కనిపించింది. గతంలో దేశంలో 5%, 12%, 18%, 28% అనే నాలుగు జీఎస్టీ శ్లాబ్లు ఉండేవి. వాటిని ఇప్పుడు 5%, 18% అనే రెండు శ్లాబ్లుగా విభజించారు. ఈ మార్పు వల్ల నిత్యం ఉపయోగించే దాదాపు 99% వస్తువులు చౌకగా మారాయి. ఇది వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించింది.
పన్ను సంస్కరణలు అమలులోకి రాగానే ప్రజలు కొనుగోళ్లకు పరుగులు తీశారు. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ-కామర్స్ కంపెనీలలో ఫ్యాషన్ నుండి గృహోపకరణాల వరకు అన్ని విభాగాలలో అమ్మకాలు పెరిగాయి. ఫ్యాషన్ బ్రాండ్ స్నిచ్ ఆర్డర్లలో 40% పెరుగుదల చూడగా, ది ప్యాంట్ ప్రాజెక్ట్ గత ఏడాదితో పోలిస్తే 15-20% వృద్ధిని నమోదు చేసింది. షాడో ఈటెల్ కూడా గత వారంతో పోలిస్తే గృహోపకరణాల ట్రాఫిక్లో 151% పెరుగుదల చూసింది.
టీవీ, ఏసీలు కూడా భారీగా అమ్ముడయ్యాయి
థామ్సన్, కోడక్, బ్లూపన్క్ట్ వంటి గ్లోబల్ బ్రాండ్ల లైసెన్స్లు ఉన్న టీవీ తయారీ సంస్థ సూపర్ ప్లాస్ట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (SPPL) సీఈఓ అవనీత్ సింగ్ మార్వా మాట్లాడుతూ.. జీఎస్టీ 2.0 మొదటి రోజునే అమ్మకాల్లో 30 నుండి 35% పెరుగుదల కనిపించిందని తెలిపారు. “43 అంగుళాల, 55 అంగుళాల టీవీ సెట్ల అమ్మకాలు 30 నుండి 35% వేగంతో పెరిగాయి. ఈ సమయంలో ఎయిర్ కండిషనర్లు కూడా బాగా అమ్ముడయ్యాయి. స్ప్లిట్ ఏసీల ధరలు రూ. 3000-5000 తగ్గాయి. ప్రీమియం టీవీలపై రూ. 85,000 వరకు తగ్గింపు లభించింది” అని ఆయన అన్నారు.