Gold Price: బంగారం ధర పతనం..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 11:07 IST
Published By : Hashtagu Telugu Desk
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ శుభవార్త అందింది. కేంద్రం ఒకవైపు దిగుమతి సుంకాల్ని భారీగా పెంచినా, వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. ప్రస్తుతం హైదరాబాద్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్న్యూస్. వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు మే 15న ఒక్కరోజులోనే రూ. 2 వేలకు పైగా పతనం కావడం విశేషం. అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు క్రూడాయిల్ ధరలు (Crude Oil Prices) భారీగా పెరుగుతుండటం, ఇదే సమయంలో యూఎస్ డాలర్ బలోపేతం కావడంతో బంగారంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే ధరలు దిగొస్తున్నాయి. ఇప్పుడు దేశీయంగా అదే విధంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా దిగొచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో అలాగే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయనేది మనం చూద్దాం.
హైదరాబాద్ నగరంలో మే 15న ఉదయం 10 గంటల సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు ఒక్కరోజులో రూ. 2050 తగ్గగా, 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 1,46,750 వద్ద ఉంది. కేంద్రం సుంకాలు పెంచిన తర్వాత భారీగా పెరిగిన బంగారం ధర (Gold Import Duty Hike) కిందటి రోజు కూడా రూ. 5 వేల వరకు తగ్గుముఖం పట్టింది. అంతకుముందు ఒక్కరోజే రూ. 12 వేలు పెరిగిన సంగతి తెలిసిందే. మరోవైపు 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ. 2,240 తగ్గడంతో 10 గ్రాములకు హైదరాబాద్ నగరంలో రూ. 1,60,090 వద్ద ఉంది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు తాజాగా రూ. 10 వేలు తగ్గడంతో కేజీకి ప్రస్తుతం రూ. 3.05 లక్షల వద్ద ఉంది. దీనికి ముందటి రోజు కూడా సిల్వర్ రేటు రూ. 5 వేలు తగ్గింది. అంతకుముందు దిగుమతి సుంకాలు పెంచిన సమయంలో ఒక్కరోజే రూ. 20 వేలు ఎగబాకింది.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు కిందటి రోజు ఔన్సుకు 4700 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఒక్కరోజులో 100 డాలర్ల వరకు తగ్గి 4,600 డాలర్లకు పడిపోయింది. సిల్వర్ రేటు 87 డాలర్ల స్థాయి నుంచి 81 డాలర్లకు దిగొచ్చింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మాత్రం రూ. 95.90 స్థాయికి చేరి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిని తాకింది.
దిగుమతి సుంకాలు పెంపు..
విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో భాగంగా.. కేంద్రం బంగారం, వెండి దిగుమతులపై సుంకాల్ని 6 శాతం నుంచి ఒక్కసారిగా 15 శాతానికి పెంచింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్లో గోల్డ్ దిగుమతుల విలువ ఏకంగా 25 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో.. దిగుమతుల బిల్లు తగ్గించుకునేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.