అంబాజీ మాత ఆలయానికి అనంత్ అంబానీ రూ.27.50 కోట్ల భారీ విరాళం
- Author : Vamsi Chowdary Korata
Date : 20-02-2026 - 10:07 IST
Published By : Hashtagu Telugu Desk
Anant Ambani దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబం సంపాదనకే కాదు.. దాతృత్వంలోనూ ఫేమస్. పలు కార్యక్రమాల కోసం విరాళాలు అందిస్తుంటుంది. బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు కూడా తరచుగా కోట్లల్లో విరాళాలు అందజేస్తుంటుంది. ఇప్పుడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ.. గుజరాత్లోని అంబాజీ మాతా ఆలయానికి రూ. 27.50 కోట్ల విరాళం ఇవ్వడం విశేషం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ గొప్ప మనసు చాటుకున్నారు. గుజరాత్ అంబాజీ పట్టణంలోని శ్రీ అరాసురి అంబాజీ మాతాజీ ఆలయానికి కళ్లుచెదిరే మొత్తం విరాళం అందించారు. అనంత్ అంబానీ తరఫున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు ఆలయ ట్రస్టుకు రూ. 27.50 కోట్ల మేర విరాళం ఇచ్చారు. భారతదేశంలో ఉన్న 51 శక్తి పీఠాల్లో ఇదొకటి. భక్తులకు సౌకర్యాల్ని పెంచాలన్న లక్ష్యంతో దేవస్థాన్ ట్రస్టు.. జై అంబే తిథి భోజన్ అనే కొత్త సేవా పథకాన్ని ప్రకటించింది. కొన్ని గంటల్లోనే దీనికి అనంత్ అంబానీ నుంచి విరాళం ప్రకటన రావడం విశేషం.
అనంత్ అంబానీ ఇచ్చిన విరాళాన్ని.. అంబాజీ మాత ఆలయ ప్రాంగణంలోని అంబికా అన్నక్షేత్రంలో రానున్న 5 సంవత్సరాల పాటు భక్తులకు అన్నదానం చేసేందుకు వినియోగించనున్నారు. బుధవారం రోజు కొత్త సేవా పథకాన్ని ప్రారంభించగా రూ. 30 కోట్లకు పైగా విరాళం అందింది. ఇందులో మెజార్టీ భాగం అనంత్ అంబానీ నుంచే వచ్చింది. ఈ అన్నక్షేత్రంలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.. అలాగే మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఆహారం ఉచితంగా వడ్డిస్తారు. సాధారణ రోజుల్లో నిత్యం 6 వేల మంది.. ప్రత్యేక సందర్భాల్లో 8 వేల మంది వరకు అన్నప్రసాదం అందిస్తారు.
ముకేశ్ అంబానీ కుటుంబం ఎప్పటినుంచో దాతృత్వ సేవల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంత సంపాదించినా.. ఎంతో కొంత పలు ఆలయాలకు, పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు, పేదలకు చదువు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన సహా ఇతర కార్యక్రమాలకు కేటాయిస్తుంటారు. అంతకుముందు ముకేశ్ అంబానీ హిందూ దేవాలయాలైన బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలకు రూ. 10 కోట్ల మేర విరాళం ప్రకటించారు. ఈ ఆలయాలకు తరచుగా విరాళం అందిస్తుంటారన్న సంగతి తెలిసిందే.
మరోవైపు ముంబైలోని తాను చదువుకున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి ఏకంగా రూ. 151 కోట్ల విరాళం ప్రకటించారు. తన గురువు ప్రొఫెసర్ ఎం.ఎం. శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ఇవ్వడం విశేషం. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో ముకేశ్ అంబానీ కుటుంబం దేశంలో పలు కార్యక్రమాల కోసం తమ సంస్థ నుంచి రూ. 626 కోట్లు విరాళం అందించినట్లు ది ఎడెల్గివ్ అండ్ హురూన్ ఇండియా ఫిలాంత్రపీ లిస్ట్ పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే 54 శాతం పేర్కొంది. దీంట్లో ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ కోసం కేటాయించింది.