E20 Fuel Policy: సుప్రీంకోర్టుకు చేరిన E20 ఇంధన విధానం.. అసలు ఈ20 ఇంధనం అంటే ఏమిటి?
అక్టోబర్ 2026కు ముందు భారతదేశం E20 నుండి మరింత ముందుకు వెళ్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతానికి E20 ఇంధనం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
- By Gopichand Published Date - 02:05 PM, Sat - 30 August 25

E20 Fuel Policy: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో E20 ఇంధనం (E20 Fuel Policy) గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఈ ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల తమ వాహనాల మైలేజ్ గణనీయంగా తగ్గిందని చాలా మంది కారు, బైక్ యజమానులు ఫిర్యాదు చేస్తున్నారు. నిజానికి కాలుష్యాన్ని తగ్గించి దేశం సుస్థిరత లక్ష్యాలను సాధించేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 2023లో E20 ఇంధనాన్ని విడుదల చేసింది. అయితే ఈ ఇంధనం పాత, నాన్-E20 వాహనాలకు తప్పనిసరి కావడంతో వాహనదారులలో అసంతృప్తి పెరిగింది.
సుప్రీం కోర్టుకు చేరిన కేసు
వాహన యజమానుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ వివాదం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. న్యాయవాది అక్షయ్ మల్హోత్రా ఈ అంశంపై ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. సెప్టెంబర్ 1, 2025న ఈ పిటిషన్పై విచారణ జరగనుంది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ (జస్టిస్ కె. వినోద్ చంద్రన్, ఎన్వీ అంజారియా) ఈ కేసును విచారించనుంది. ఈ పిటిషన్ ప్రధాన లక్ష్యం వినియోగదారులకు ప్రతి పెట్రోల్ బంకులో E0 పెట్రోల్ (ఎథనాల్ లేని పెట్రోల్) ఎంచుకునే అవకాశం ఉండాలి. అలాగే ఇంధనంపై ఎథనాల్ శాతం స్పష్టంగా లేబుల్ చేయడం తప్పనిసరి కావాలి.
Also Read: Asia Cup 2025: ఆ ఐదుగురు ఆటగాళ్లు లేకుండానే దుబాయ్కు టీమిండియా?!
ప్రభుత్వం వివరణ
ఈ వివాదం పెరగడంతో భారత ప్రభుత్వం తరఫున నిరంతరం వివరణలు వస్తున్నాయి. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ X (గతంలో ట్విట్టర్)లో ఒక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం ఎథనాల్ శక్తి సాంద్రత పెట్రోల్ కంటే తక్కువగా ఉండటం వల్ల మైలేజ్పై కొద్దిగా ప్రభావం పడుతుంది. E10 నుండి E20కి అనుకూలమైన కార్లలో ఈ ప్రభావం 1-2% వరకు ఉంటుందని, మిగతా వాహనాలలో 3-6% వరకు ఉంటుందని పేర్కొంది. ఇంజిన్ ట్యూనింగ్, E20కి అనుకూలమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ ప్రభావాన్ని మరింత తగ్గించవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. పెద్ద ఆటోమొబైల్ తయారీదారులు ఇప్పటికే ఈ మార్పులు చేశారని కూడా వివరించింది.
బీమా పాలసీలపై వదంతులు
E20 ఇంధనం ఉపయోగించడం వల్ల వాహన బీమా పాలసీలు రద్దు అవుతాయని పలు చోట్ల వదంతులు వ్యాపించాయి. అయితే ఇది పూర్తిగా అవాస్తవమని ప్రభుత్వం స్పష్టం చేసింది. E20ని ఉపయోగించడం వల్ల బీమా పాలసీపై ఎలాంటి ప్రభావం ఉండదని, దాని చెల్లుబాటు ముగియదని ప్రభుత్వం తెలిపింది.
E20 ఇంధనం అంటే ఏమిటి?
E20 ఇంధనం అంటే 20% ఎథనాల్ + 80% పెట్రోల్. కాలుష్యాన్ని తగ్గించడానికి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏప్రిల్ 2023లో దీనిని ప్రారంభించింది.
భవిష్యత్తులో ఏం జరగబోతుంది?
అక్టోబర్ 2026కు ముందు భారతదేశం E20 నుండి మరింత ముందుకు వెళ్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతానికి E20 ఇంధనం మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే భవిష్యత్తులో మరింత ఎక్కువ ఎథనాల్ కలపాలని ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఈ చర్య భారతదేశాన్ని స్వచ్ఛమైన ఇంధనం వైపు నడిపిస్తుంది. అయితే వాహనదారుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని కోర్టు నిర్ణయం కీలకం కానుంది.