CM Chandrababu: కడప పార్లమెంట్ కూడా మనమే గెలవాలి: సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల్లో 93 శాతం సీట్లు మనమే గెలిచాం. టీడీపీ ఎన్నడూ గెలవని రీతిలో మనం విజయం సాధించాం. కడప పార్లమెంటు కూడా మనమే గెలవాలి. రానున్న ఎన్నికలలో కష్టపడదాం.
- By Gopichand Published Date - 03:48 PM, Sat - 18 January 25

CM Chandrababu: కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్టీఆర్ 29వ వర్ధంతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (CM Chandrababu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముందుగా మైదుకూరు తెలుగుదేశం పార్టీ నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ 29 వర్ధంతి మైదుకూరులో జరగడం మీ అదృష్టం. తెలుగు జాతి ఆత్మగౌరవం నందమూరి తారక రామారావు. బడుగు బలహీనర్గాలకు చెరగని దైర్యం నందమూరి తారక రామారావు. ఆరోజు ఆయన ఇచ్చిన ఫించన్ 35 రూపాయలు.. ఈరోజు 4000 వేల రూపాయలు అయ్యాయని” అన్నారు.
సీఎం చంద్రబాబు ఇంకా మాట్లాడుతూ.. “నందమూరి తారక రామారావు ఒక స్పూర్తి. ఆదర్శంగా నిలిచారు. ఒక రైతు కుటుంబంలో జన్మించిన వ్యక్తి అంచలంచెలుగా ఎదిగాడు. అటువంటి మహానేత మళ్ళీ పుట్టడు. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ.. అనంతపురం జిల్లా ఎడారిగా మరుతుండగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పనులు చేశాం. కడప జిల్లాలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కడప జిల్లాకు అన్ని విధాలా సహకరిస్తానని మాట ఇస్తున్నా. రాయలసీమ రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాం. రాయలసీమ రైతాంగం మీసాలు తిప్పే రోజు వస్తుంది. రాయల సీమలో ముఠా కక్షలు ఉండేవి. వాటిని అణచి వేసింది తెలుగుదేశం పార్టీ. పోలవరం ప్రాజెక్టు నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంటే వాటిని టీడీపీ ఆపింది” అని అన్నారు.
రెండు సంవత్సరాల్లో పోలవరం నిర్మాణం చేపట్టి తీరుతామని ప్రజలకు హామీ ఇచ్చారు. “ఎన్టీఆర్ జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులకు నీరు అందిస్తాం. నేరుగా నీరు అందించి తీరుతాం. నేను కూడా రాయలసీమలోనే పుట్టాను. కరువు రాయలసీమపై బాధ్యత తీసుకుంటాను. కడప జిల్లా కొప్పర్తికి 2300 కోట్ల రూపాయలు ఇచ్చాం. కొప్పర్తికి పారిశ్రామికంగా ఆదుకొని ఉద్యోగాలు కల్పిస్తాం. 250 కోట్ల రూపాయలతో విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రపంచంలో అందమైన పర్యాటక ప్రాంతం గండికోటకు కేంద్రం 80 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించింది. గండికోటను ప్రపంచంలో 10వ పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం” అని భరోసా ఇచ్చారు.
ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. “2024 ఎన్నికల్లో 93 శాతం సీట్లు మనమే గెలిచాం. టీడీపీ ఎన్నడూ గెలవని రీతిలో మనం విజయం సాధించాం. కడప పార్లమెంటు కూడా మనమే గెలవాలి. రానున్న ఎన్నికలలో కష్టపడదాం. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఆ 25 ఎంపీ సీట్లు కూడా గెలిచేవాళ్ళం. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని కాపాడుకున్నామని” సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.