Vizag Steel Plant Privatization : వైజాగ్ స్టీల్ ప్లాంట్పై రచ్చ..ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం – పవన్ హామీ
vizag steel plant Privatization : స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారని పవన్ గుర్తు చేసారు.
- By Sudheer Published Date - 12:48 PM, Thu - 21 November 24

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బడ్జెట్ సమావేశాలు (Andhra Pradesh Legislative Council Budget Meetings) గురువారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా ప్రశ్నోత్తరాలు కొనసాగగా.. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ (Vizag Steel Plant Privatization)పై తీవ్ర చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ సభ్యులు (YCP Leaders) ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంత్రి టీజీ భరత్ దీనిపై స్పందిస్తూ..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. అయితే కర్మాగారంలో ఉన్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెయిల్లో విలీనం చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు చెల్లించకపోవడం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమేనని ప్రైవేటీకరణకు సంబంధించిన చర్యలుగా భావించవచ్చని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. “ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవడం మా లక్ష్యమని” స్పష్టం చేశారు. ఈ అంశాన్ని గతంలో కేంద్ర మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో, ప్రాంతానిదో కాదని రాష్ట్రానికి చెందినదని అన్నారు. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారని పవన్ (Pawan Kalyan) గుర్తు చేసారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్) ప్రైవేటీకరణ విషయమై గత కొన్ని సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రైవేటీకరణ అంశం ప్రజల్లో, కార్మికుల్లో, మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నిరంతర నిరసనలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఈ ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నారు. స్టీల్ ప్లాంట్ పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్రం ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి రావడం, కేంద్రంలో ఉన్న బిజెపి కూడా కూటమిలో భాగంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ జరగదని కూటమి నేతలు బలంగా చెపుతున్నారు. ఈరోజు శాసన సభలో కూడా అదే చెప్పడం జరిగింది.
Read Also : Lokesh Helps : చిన్నారి వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్