AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా
2023 సంవత్సరం నుంచి ఏపీ బీజేపీ చీఫ్గా(AP BJP) దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు.
- By Pasha Published Date - 09:26 AM, Sun - 19 January 25

AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు ? అనేది కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్షా తేల్చనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పర్యటనలో ఉన్న ఆయన ఇదే అంశంపై ప్రధాన ఫోకస్ పెట్టారట. ఈరోజు కృష్ణాజిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ను అమిత్షా ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా కూటమి నేతలు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలకు అదనంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనా షా కసరత్తు చేయనున్నారని సమాచారం. ఇవాళ విజయవాడలో జరగనున్న బీజేపీ సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే దానిపై నేతల అభిప్రాయాలను అమిత్ షా సేకరిస్తారని సమాచారం.
Also Read :Telangana Maoist Party: తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ
2023 సంవత్సరం నుంచి ఏపీ బీజేపీ చీఫ్గా(AP BJP) దగ్గుబాటి పురంధేశ్వరి వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నెలతో ఆమె పదవీకాలం పూర్తి అవుతుంది. బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్లు మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగుతారు. అయితే అంతకంటే ముందు నూతన రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. ఎంపీలతో పాటు పురంధేశ్వరి, పార్టీ సీనియర్ నేతల సలహాలు, సూచనలు రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికలో కీలకంగా మారనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నేతలు పీవీఎన్ మాధవ్, సుజనా చౌదరి, సీఎం రమేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పి.వి.పార్థసారథి పేర్లను అమిత్ షా పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Also Read :Housing Policy: సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్.. త్వరలో హౌసింగ్ పాలసీ!
రేసులో ఉన్నది వీరే..
పీవీఎన్ మాధవ్.. ఉత్తరాంధ్రకు చెందిన బీసీ నేత. ఆయన గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. మాధవ్ తండ్రి ఉమ్మడి ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా చాలా కాలం పాటు పనిచేశారు. దీంతో ఆయన పేరు పరిశీలనలో ఉందని చెబుతున్నారు. ఏపీలో మంత్రి పదవిని ఆశించి కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి భంగపడ్డారు. దీంతో ఆయన రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవిని ఆశిస్తున్నారు.అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ .. ఇటీవలే ప్రధాని మోడీ విశాఖ సభను ఘనంగా జరిపించారు. దీంతో పార్టీ పెద్దల వద్ద మంచి మార్కులు పడ్డాయి. ఇక ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఈ అవకాశం దక్కినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు చెందిన నేతల్లో ఎవరైనా ఒకరికి ఈసారి పార్టీ పగ్గాలను అప్పగిస్తారని అంచనావేస్తున్నారు.