Andhra Pradesh : తిరుపతి హథీరాంజీ ట్రస్టు భూములపై వైసీపీ నేతల డేగల కన్ను.. ప్లాట్లు వేసి అమ్మకానికి పెడుతున్న వైనం
బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్
- By Prasad Published Date - 08:28 PM, Sat - 25 November 23

బంజారాల ఆరాధ్య దైవం హధీరాంజీ ట్రస్టును నిర్వీర్యం చేసే పనిలో వైసీపీ నాయకత్వం తలమునకలైందని టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధారు నాయక్ తెలిపారు. ట్రస్టుకు చెందిన వందలాది ఎకరాల భూములపై వైసీపీ నాయకుల డేగ కళ్లు పడ్డాయని..వైసీపీకి చెందిన ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామీ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిలు కలిసి ట్రస్టు భూములను దోచుకోవాలని చూస్తున్నారని ధారు నాయక్ ఆరోపించారు. 1843 నుంచి ఎంతో ప్రసిద్ది చెందిన హధీరాంజీ మఠానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంజారా/లంబాడీ/సుగాలీలు దర్శనం చేసుకుంటారని… అంతటి చరిత్ర కలిగిన ట్రస్టుపై వైసీపీ నాయకుల కన్ను పడటం దురదృష్టకరమన్నారు. ట్రస్టుకు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు. ట్రస్టు మహంతు అర్జున్దాసుపై లేనిపోని ఆరోపణలు చేసి ఆయనను అన్యాయంగా తొలగించి ట్రస్టు ఆస్తులను వైసీపీ నాయకులు దోచుకుంటున్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లోని దాదాపు 350 ఎకరాలు మఠం భూములను నారాయణ స్వామీ, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డిలు భూముల్లో ప్లాట్లు వేసి వాటిని అమ్ముకుంటూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవిలాల పంచాయతీలోని సర్వే నెం.135.139.253.238, 12.321 17/2 17/5 148/2 లోని 45 ఎకరాలు కబ్జా చేశారని ధారు నాయక్ తెలిపారు. చంద్రగిరి మండలం, అగరాల గ్రామంలోని సర్వేనెంబర్ 140.71, 134.110/1 లలో గల 40 ఎకరాలు, మంగళంలోని సర్వే నెం. 216, 86.109 లలోని రెండు ఎకరాలు, పేరూరులోని సర్వేనెంబర్ 173, 171లలోని 10 ఎకరాలు, పుదీపట్ల గ్రామ పంచాయతీలోని సర్వేనెంబర్ 51/1 377.382లలో 40 ఎకరాలను ఇప్పటికే కబ్జా చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం మఠం అభివృద్ధిని గాలికి వదిలేసి భూములను దోచుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు.వైసీపీ నాయకుల భూ కబ్జాలకు సహకరిస్తూ చట్ట వ్యతిరేకంగా పనులకు పాల్పడుతున్న అధికారులు కూడా శిక్షార్డులే గమనించాలని… అధికారులు వైసీపీ నాయకుల ప్రలోభాలకు తలొగ్గకుండా మఠం ఆస్తులను కాపాడాలని ఆయన కోరారు.
Also Read: TDP : “బీసీల వెన్ను విరుస్తున్న జగన్” పుస్తకాన్ని ఆవిష్కరించిన టీడీపీ నేతలు