Chandrababu: చంద్రబాబుకు ‘సువేరా’ సంచలన రిపోర్ట్..!
తెలుగుదేశం అధికారంలోకి రావాలని నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు రహస్యంగా పార్టీ పరిస్థితిని చంద్రబాబు (Chandrababu)కు చేరవేసే వాళ్ళు ఉన్నారు. ఇక డబ్బు తీసుకొని సర్వేలు చేసే వాళ్లకు కొదవలేదు.
- By CS Rao Published Date - 01:02 PM, Sun - 11 June 23
Chandrababu: తెలుగుదేశం అధికారంలోకి రావాలని నిస్వార్థంగా, ఏమీ ఆశించకుండా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొందరు రహస్యంగా పార్టీ పరిస్థితిని చంద్రబాబు (Chandrababu)కు చేరవేసే వాళ్ళు ఉన్నారు. ఇక డబ్బు తీసుకొని సర్వేలు చేసే వాళ్లకు కొదవలేదు. ఇలాంటి వాళ్లకు భిన్నంగా ఉన్నది ఉన్నట్టు చెప్పే పెద్దల్లో సుంకర వేంకటేశ్వరరావు(సువేరా) ఒకరు. మీడియాలోనూ, బయట తన వాయిస్ ను బలంగా టీడీపీ పక్షాన వినిపిస్తారు. ఆయన ఇటీవల క్షేత్ర స్థాయి రాజకీయ పరిశీలనకు ఏపీకి వెళ్లారు. వాస్తవాలను తెలియచేస్తూ కొన్ని గ్రూవుల్లో తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు అది టీడీపీ గ్రూపుల్లోనే కాదు వైసీపీలోనూ చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంది. క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఉన్న మైనస్ పాయింట్ లను తెలియచేస్తూ సర్వేలను నమ్మొద్దని చంద్రబాబు (Chandrababu)కు సలహా ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. ఆయన పరిశీలన తరువాత రాసిన పాయింట్స్ ఇలా ఉన్నాయి.
*వాస్తవాలకు క్షేత్రస్థాయికి దూరంగా, సోషల్ మీడియా ఊహల్లో విహరిస్తూ, గాల్లో తేలుతూ ఉంటే నడ్డివిరగడం ఖాయం.!
*నిన్న(09/6/23) ఒకరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకమైన ప్రాంతాల్లో పర్యటించి వచ్చాను.
*అన్ని వర్గాలకు చెందిన చాలామందితో మాట్లాడడం జరిగింది, అందులో భాగంగా నేను గమనించింది ఏమిటంటే..,
*2019 ఎన్నికల నాటికి నేటికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో పాలకపార్టీకి వ్యతిరేకంగా పెద్ద మార్పు ఏమీలేదు.
*బీసీలలో కొద్దిపాటి మార్పు ఉన్నమాట వాస్తవం.
Also Read: Kothagudem BRS: కొత్తగూడెం బీఆర్ఎస్ అభ్యర్థిగా గడల శ్రీనివాస్?
*ప్రభుత్వ/పాలకపార్టీ వైఫల్యాలను ప్రజలకు చెప్పడంలో, రాష్ట్రంలోని పరిస్థితిని ప్రజలలోకి తీసుకువెళ్లడంలో తెలుగుదేశంపార్టీ జిల్లా నియోజకవర్గ మండల గ్రామ నాయకత్వం పూర్తిగా నిస్తేజంగా ఉంది, నిమ్మకు నీరెత్తనట్లు ఉంది.
*తెదేపా నాయకత్వం నియోజకవర్గ స్థాయిలో ముఠాలుతో, అపనమ్మకం అభద్రతాభావంతో, ఎవరి స్థాయి ఏమిటో తెలియని వైఫల్యంలో ఉంది.
*తెలుగుదేశంపార్టీని, ఆ పార్టీ చేస్తున్న ఉచిత వాగ్ధానాలనూ మెజారిటీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ
వర్గాలు నమ్మడంలేదు.
*వీటి మీద నమ్మకం కలిగించే రీతిలో తెదేపా నాయకత్వం ఇంటింటికీ తిరుగుతూ పనిచేయడంలేదు.
*ఇంతవరకూ బూత్ కమిటీలు లేవు, ఓట్ల జాబితా గురించి, దొంగ ఓట్లు గురించి, సొంత ఓట్లను చేర్పించడం గురించి పట్టించుకున్నవాళ్ళు లేరు.
*గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాయకత్వ లోపాలు కనిపిస్తున్నాయి.
*రేపు బూత్ ల వారీగా పోలింగ్ ఏజెంట్లు, ఎన్నికల ఏజెంట్లు ఎవరో ఏమిటో ఇంతవరకూ పార్టీ నాయకత్వానికి శ్రద్ధాలేదు.
*చాలాచోట్ల నియోజకవర్గ ఇంచార్జ్ లకు ఆ నియోజకవర్గాల పట్ల ఏమాత్రం అవగాహన లేదు.
*అన్ని జిల్లాల నాయకత్వం పూర్తిగా అట్టడుగు స్థాయిలో ఉంది. దీన్ని సమీక్షించేవాళ్ళు తెదేపా కేంద్ర కార్యాలయంలో కరువయ్యారు.
*”పార్టీ బరువుని బాధ్యతలను పూర్తిగా తండ్రీకొడుకులు ఇద్దరే మోస్తున్నారు”.
*తండ్రీకొడుకులు ఇద్దరూ వాస్తవాలకు క్షేత్రస్థాయికి దూరంగా ఉంటూ, తప్పుడు సర్వేలను, మేనేజ్డ్ సర్వేలను నమ్ముకుంటూ, కేవలం సోషల్ మీడియానే నమ్ముకుని రాజకీయం చేసి గెలవాలని, నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూ సంతోషిస్తున్నట్లు కనపడుతోంది.
*నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ, జిల్లా నాయకులుగానూ, శ్రీ చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్నవాళ్ళల్లో నూటికి తొంభైమంది నయవంచకులు కాలక్షేపంరాయుళ్లు అన్నట్లు అనిపిస్తోంది.
*రేపు ఎన్నికల రోజున ఓటర్లకు వేసే ఇంకు, ఎన్నికల కమిషన్, ప్రిసైడింగ్ అధికారుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఆ ఇంకు దుర్వినియోగం అయ్యే సూచనలు ఉన్నట్లు వినిపిస్తోంది. అధికారపక్షం ఆ ఇంకుని బూతులు వారీగా, ఒక్కో బూత్ కి యాభైమంది ఓటర్లకు వాళ్ళు పోలింగ్ బూతులకు వెళ్లి ఓట్లు వేయకుండానే ముందుగానే, వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి వాళ్ళను నయానో భయానో లొంగదీసుకుని, వాళ్ళ వేళ్ళ మీద ఆ ఇంకు వేసి, వాళ్ళను ఓట్లకు దూరంచేసే విధంగా కుట్రలు ఉన్నాయి. ఇలాంటి ఓట్లు అత్యధిక శాతం తటస్థ ఓటర్లవి.
*వాలంటీర్ వ్యవస్థ దూరాగతాలకు అంతేలేదు, వాలంటీర్లకు భయపడుతూ ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు, దీన్ని బయటకు మాట్లాడగలిగే తెలుగుదేశం నాయకులే కరువయ్యారు.
*నూటికి తొంభైమంది తెలుగుదేశం నాయకులు సోమరిపోతులుగా అవకాశవాదులుగా అహంకారులుగా అజ్ఞానులుగా అచేతనులుగా అయోమయంగా ఉన్నారు.
*దీన్ని తక్షణమే పరిష్కరించకపోతే తెలుగుదేశం గెలవడం అసంభవమే అనిపిస్తోంది.
*వీటిని అన్నిటినీ యుద్ధప్రాతిపదికన పర్యవేక్షణ పరిశీలన పరిష్కారం చేసుకుని, తెలుగుదేశం గనక పోల్ మానేజ్ మెంట్ సరిగ్గా చేసుకోలేకపోతే గెలుపు కష్టం.
*ఇప్పటికి ఉన్న పరిస్థితి ప్రకారం తెలుగుదేశం పార్టీ గెలుపు 50:50 అన్నట్లుగానే ఉంది.
*లేదా మరీ కొద్దిపాటి మొఖమాటంతో చెప్పాలంటే 55:45 (55% తెలుగుదేశం పార్టీ, 45% వైఎస్సార్సీపీ) అని చెప్పాలి, కానీ… ఇలాంటి పరిస్థితుల్లో 60% తెలుగుదేశం పార్టీకి మొగ్గుగా ఉన్నా కూడా, డబ్బు అధికారం మరియు బీజేపీ సహకారంతో దాన్ని 50% కి తీసుకురావడం అధికారపార్టీకి పెద్ద కష్టం కాకపోవచ్చు.
*ఇలాంటి పరిస్థితుల్లో పోల్ మేనేజ్ మెంట్, డబ్బు రవాణా, బూతుల నిర్వాహణ, కార్యకర్తలలో ధైర్యం ధీమా నమ్మకం నింపడం చాలా కీలకం.
*నిజంగా ఇది నాకు అనవసరం, నాకూ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి సంబంధంలేదు, ఇది కేవలం అభిమానంతో పార్టీకి మంచికోరి, తెలుగుదేశం గెలిస్తే ఆ రాష్ట్రానికి సమాజానికి మంచి జరుగుతుందనే ఆశతో చెబుతున్న వాస్తవమే తప్పించి, వేరేది కాదు.
తప్పుగా అర్ధంచేసుకుని, ఇంకా ఊహల్లో భ్రమల్లో విహరిస్తే వాళ్ళ ఖర్మ, అమాయక కార్యకర్తల దురదృష్టం.
Related News
AP Funds : పథకాల నిధులు పక్కదారి.. కాంట్రాక్టర్లకు చెల్లింపులు..!
పోలింగ్ ముగిసి నాలుగు రోజులు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు సంక్షేమ పథకాలు అందడం లేదు.