Visakhapatnam Steel Plant: వైజాగ్ స్టీల్ప్లాంట్ అధికారులపై సీరియస్
- Author : Vamsi Chowdary Korata
Date : 13-06-2026 - 9:43 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదం తర్వాత కూడా ప్లాంట్లోని ఎస్ఎంఎస్ విభాగంలో వరుస ప్రమాదాలు జరగడంతో ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. ఈ వరుస ప్రమాదాలకు బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు.. పలువురిని బదిలీ చేశారు. ఉన్నతాధికారులు స్టీల్ప్లాంట్లోని లాడిల్స్ను, సెంట్రల్ స్టోర్స్ను తనిఖీ చేశారు. క్వాలిటీ లేని ఫెర్రో అల్లాయ్స్ బయటపడటంతో చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన వారిలో ఎస్ఎంఎస్-1, 2లలో పదిమంది, మెటీరియల్ మేనేజ్మెంట్ విభాగం నుంచి ఐదుగురు, క్యూఏటీడీ (క్వాలిటీ అష్యూరెన్స్ టెస్టింగ్ డిపార్ట్మెంట్) నుంచి ఏడుగురు ఉన్నారు.
విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో ఉన్నత స్థాయి అధికారులు తనిఖీలకు వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. కొకాలంగా నాసిరకం మెటీరియల్ వస్తోందని గుర్తించారు. ప్లాంట్లోని స్టీల్ మెల్టింగ్ షాపు-1, 2లలో హాట్ మెటల్కు ఫెర్రో అల్లాయ్స్, ఇతర మెటల్స్ మిక్స్ చేస్తారు. ఈ రెండూ నాణ్యమైనవో కావో క్వాలిటీ కంట్రోల్ అధికారులు తేల్చాల్సి ఉంటుంది. కానీ నాసిరకం మెటీరియల్ వస్తుందని గుర్తించి ఉన్నతాధికారులు అధికారులను సస్పెండ్ చేశారు. డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులు సస్పెండ్ అయ్యారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అధికారులను సస్పెండ్ చేయగానే సమస్య పరిష్కారం కాదని.. లోపాలను గుర్తించి సరిచేయాలని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.
విశాఖ స్టీల్ప్లాంట్లో వరుస ప్రమాదాలు కలవరపెట్టాయి. ఈ నెల 8న జరిగిన ప్రమాదం తర్వాత ఎస్ఎంఎస్-2లో ల్యాడిల్ నుంచి ఉక్కు ద్రవం (Molten Steel) నేలపాలైంది. రెండు రోజుల క్రితం మళ్లీ ఎస్ఎంఎస్-1టీపీబేలో ల్యాడిల్కు రంధ్రం పడి ఉక్కు ద్రవం నేలపాలైంది. ఈ రెండు ప్రమాదాలు జరిగిన సమయంలో అదృష్టవశాత్తూ అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణ నష్టం లేకపోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. ఉక్కు ద్రవం అధిక ఉష్ణోగ్రతతో ఉంటుంది.. ఒక్కసారిగా ల్యాడిల్ నుంచి బయటకు రావడంతో వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. వెంటనే ప్లాంట్ భద్రతా సిబ్బంది, సాంకేతిక నిపుణులు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.