Visakhapatnam Steel Plant: కన్నీళ్లు పెట్టిస్తున్న స్టీల్ ప్లాంట్ బాధితుడు.. తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకో డాడీ
- Author : Vamsi Chowdary Korata
Date : 09-06-2026 - 2:31 IST
Published By : Hashtagu Telugu Desk
విశాఖపట్నం స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికుడి మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. కాలిన గాయాలతో ఆస్పత్రిలో ఉన్న ఆయన, పెద్ద కొడుకు మరియు కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. తమ్ముడిని, అమ్మను బాగా చూసుకోమని కార్మికుడు చెప్పారు. ఇద్దరూ బాగా చదువుకోవాలని.. ఉంటాను డాడీ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కార్మికుడి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
ఇంటి పెద్దలను కోల్పోయిన ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారు, గాయపడిన వారి కుటుంబాల్లో ఎవరిని అడిగినా కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. అప్పలరాజు అనే కార్మికుడికి సోమవారం వీక్లీ ఆఫ్ ఉంది.. కానీ సిబ్బంది కొరత కారణంగా విధులకు రమ్మని చెప్పడంతో వెళ్లారు.. పాపం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భానుకుమార్ అనే టెక్నీషియన్ సోమవారం సీ షిఫ్టులో డ్యూటీకి వెళ్లాల్సి ఉంది.. కానీ తోటి ఉద్యోగిని అడిగి బీ షిఫ్టులో వెళ్లి ప్రమాదంలో మృతిచెందారు. మరో కార్మికుడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు.. ఆయన ఆస్పత్రిలో చెప్పిన మాటలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
కన్నీళ్లు పెట్టిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితుడి మాటలు…😰
తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో. అమ్మను బాగా చూసుకోండి.
ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.#VizagSteelPlant #Visakhapatnam #FireAccident #AndhraPradesh #LatestNews… pic.twitter.com/xnbYYCyWrd
— Tupaki (@tupaki_official) June 9, 2026
వర్మ.. తమ్ముడిపై చిరాకు పడకు.. తమ్ముడిని బాగా చదివించు. నువ్వు కూడా బాగా చదువుకో.. అమ్మను బాగా చూసుకోండి.. ఉంటాను డాడీ’ అంటూ ఆ కార్మికుడు కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. స్టీల్ప్లాంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తన చివరి మాటలను రికార్డ్ చేయించుకున్నాడు. ఆయన తన పెద్ద కొడుకును, తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని, ఇద్దరూ బాగా చదువుకోవాలని చెప్పారు. తల్లిని కూడా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కార్మికుడి పేరు పైడిరాజు అని చెబుతున్నారు.. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.
విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది చనిపోగా, తీవ్రంగా గాయపడిన మరికొందరు కార్మికులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన వారిలో చాలా మంది 40 నుండి 90 శాతం వరకు కాలిన గాయాలతో బాధపడుతున్నారు. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికుల కుటుంబాలను, గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, ఏపీ మంత్రులు అనిత, సంధ్యారాణిలతో పాటుగా విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్లు కూడా పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గాయపడిన వారి వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు.
మరోవైపు ప్రమాదంలో చనిపోయినవారి మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనలో కార్మికుల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉండటంతో.. వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు. మృతదేహాల నుంచి శాంపిల్స్ సేకరించి విజయవాడ ల్యాబ్కు పంపిస్తామన్నారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత బంధువులకు అప్పగిస్తామన్నారు. చనిపోయిన వారిలో భానుకుమార్, రమణ, అప్పలరాజు మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. వీరి మృతదేహాలను వాహనాల్లో స్వస్థలాలకు తరలించారు.