Viveka Murder Case: వివేకా హత్య కేసు నిందితుల కస్టడీ పొడిగింపు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు కొలిక్కి రావడం లేదు. ఏళ్ళు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగమనం కనిపించడం లేదు
- Author : Vamsi Chowdary Korata
Date : 16-06-2023 - 5:59 IST
Published By : Hashtagu Telugu Desk
Viveka Murder Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసు కొలిక్కి రావడం లేదు. ఏళ్ళు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ కేసుని ప్రస్తుతం సీబీఐ విచారిస్తుంది. అయితే నాలుగేళ్లుగా ఈ కేసులో జరిగింది ఏంటంటే.. విచారించడం, కస్టడీలోకి తీసుకోవడం తప్ప, నిందితులకు శిక్ష పడింది లేదు. తాజాగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరుగురు నిందితుల జ్యుడిషియల్ కస్టడీని సిబిఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది.
కడప ఎంపీ వై.ఎస్.అవినాష్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి సహా నిందితులను సిబిఐ కోర్టులో హాజరుపరచగా, జూన్ 30 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. ప్రస్తుతం హైదరాబాద్లోని చంచల్గూడ సెంట్రల్ జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిల జ్యుడీషియల్ కస్టడీ శుక్రవారం ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. నిందితుల రిమాండ్ పొడిగించడంతో నిందితులను మళ్లీ జైలుకు తరలించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మార్చి 15, 2019న పులివెందులలోని ఆయన నివాసంలో హత్యకు గురైన విషయం తెలిసిందే.