Macharla : `వై నాట్ 175`కు పులివెందుల ఫార్ములా! మాచర్లలో షురూ!
` వై నాట్ 175`(why not 175), ఈసారి కూడా గెలిస్తే మరో 30ఏళ్లు మనమే
- By CS Rao Published Date - 12:26 PM, Sat - 17 December 22
` వై నాట్ 175`(why not 175), ఈసారి కూడా గెలిస్తే మరో 30ఏళ్లు మనమే అధికారంలో ఉంటాం అంటూ ఈ మధ్య వైసీపీ శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు ఇస్తోన్న దిశానిర్దేశం. దాని వెనుక ఏదో మతలబు ఉంటుంది. లేదంటే , ఆయన అనాలోచితంగా చెప్పరని ఆ పార్టీ వర్గాల్లోని చర్చ. ఎలాగైనా ఈసారి అధికారంలోకి వస్తే పులివెందుల(Pulivendula) మాదిరిగా ఏపీ వ్యాప్తంగా పాగా వేసే ఎత్తుగడ ఉందని విపక్ష నేతల భావన. అందుకు అనుగుణంగా గృహసారథుల రూపంలో జగనన్న సైన్యం నిర్మితం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5లక్షల 50వేల మంది సైన్యంగా ఏర్పడనున్న కరుడుకట్టిన వైసీపీ క్యాడర్ మాచర్ల(Macharla) తరహా ఉద్రిక్తతలను రేపనుందని సర్వత్రా వినిపిస్తోంది.
జగనన్న సైన్యం రూపంలో పులివెందుల(Pulivendula) స్టైల్ పాలిటిక్స్ కు పునాదులు పడుతున్నాయని ప్రత్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి స్థాయిలో సైన్యం సిద్ధం కాకముందే మాచర్ల(Macharla) సంఘటన తెర మీదకు వచ్చింది. సేమ్ టూ సేమ్ అలాంటి ఉద్రిక్తతలను లేపడం ద్వారా వచ్చే ఎన్నికలను సానుకూలంగా మలుచుకోవాలని వైసీపీ చేస్తోన్న ప్లాన్ గా టీడీపీ అనుమానిస్తోంది. అందుకు కొన్ని ఉదాహరణలను చూపుతోంది. విజయవాడంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై ఇటీవల వైసీపీ క్యాడర్ దాడికి తెగబడ్డారు. అందుకు సారథ్యం వహించిన జోగి రమేష్ కు మంత్రి పదవి దక్కింది. ఆనాడు జరిగిన సంఘటన టీడీపీ శ్రేణులకు కలవరపరిచింది. ఆ తరువాత విశాఖ కేంద్రంగా జనసేన శ్రేణుల మీద అటాక్ జరిగింది. ఇప్పుడు మాచర్ల కేంద్రంగా టీడీపీ శ్రేణుల మీద జగనన్న సైన్యం దాడులకు తెగబడింది. అక్కడి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగులు బెట్టారు. మాచర్ల నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పు బెట్టారు. భయానక వాతావరణాన్ని సృష్టించారు.
ఓటర్లు బూత్ లకు రాకుండా
గతంలో కడప జిల్లాలో ఇలాంటి సంఘటనలను చూశాం. ఓటర్లు బూత్ లకు రాకుండా ఓట్లు వేసుకునే సంస్కృతి పులివెందుల(Pulivendula) నియోజకవర్గంలో ఉండేది. వైఎస్ కుటుంబం మినహా ఎవరూ అక్కడ పోటీ చేయడానికి సాహసం చేసే వాళ్లు కాదు. కానీ, స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీని పెట్టిన తరువాత క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. పులివెందుల నియోజకవర్గంలోనూ వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడే స్థాయికి అక్కడ పరిస్థితి వచ్చింది. ఏపీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరిగి పాత కాలపు సంస్కృతి అక్కడ కనిపిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును అందుకు ఉదాహరణగా చూపుతోంది.
`వై నాట్ 175`(why not 175) వెనుక మాచర్ల(Macharla) తరహా ఫార్ములా ఉందని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వరకు వచ్చే అవకాశం ఉండదు. విపక్ష పార్టీల ఏజెంట్లు కూడా ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితులు ఉండవు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు విపక్ష పార్టీల క్యాడర్ వెనకడుగు వేస్తుంది. రాబోవు రోజుల్లో బహిరంగ సభలకు జనం స్వేచ్ఛగా తరలి రావడానికి సందేహిస్తారు. వచ్చే ఏడాదికల్లా మాచర్ల(Macharla) తరహా ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింప చేస్తే `వై నాట్ 175` సాకారం అవుతుందని వైసీపీ వేస్తోన్న ప్లాన్ గా విపక్ష నేతల అనుమానం. ఇక `వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం`లోనూ లాజిక్ లేకపోలేదు. ఒక వేళ వచ్చే ఎన్నికల్లో మరో ఛాన్స్ ఇస్తే జగన్మోహ్మన్ రెడ్డి దెబ్బకు టీడీపీ బలహీనపడుతుందని వైసీపీ భావన. పైగా చంద్రబాబుకు వయస్సు మీద పడుతోంది. పులివెందుల(Pulivendula) తరహా ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మరో 30ఏళ్లు సీఎంగా ఉండొచ్చని జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఆ దిశగా మాచర్ల నుండి జగనన్న సైన్యం అడుగు వేసిందని టీడీపీ అనుమానిస్తోంది.
టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్
ప్రస్తుతం టీడీపీ నేతలు మాచర్ల(Macharla)కు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రులు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీల నివాసాల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ మాచర్లలోనే ఉన్నారు. ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అలాగే, డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గూండాలకు సహకరించిన పోలీసు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్ల(Macharla)లో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు. ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ఇదంతా జరగడానికి ముందుగా పోలీసులు అప్రమత్తం కావాలి. సంఘటన జరిగే వరకు పోలీసులు అప్రమత్తం కాలేదు. పైగా జరగాల్సిన నష్టం జరిగిన తరువాత పోలీసులు రంగంలోకి దిగడం విమర్శలను ఎదుర్కోంటోంది. ఇదే తరహాలో పోలీసులు అధికార పార్టీకి సహకారం అందిస్తే `వై నాట్ 175` అండ్ `మరో 30 ఏళ్లు మనదే అధికారం` నినాదం కోసం పులివెందుల(Pulivendula) తరహా ఫార్ములా తయారు అవుతున్నట్టే భావించాలి.
CM Jagan : ఎన్నికలకు జగన్ రోడ్ మ్యాప్! 50 మంది ఓటర్లకు 2 వాలంటీర్లు!
Related News
AP Polling : టీడీపీతో పోలీసులు కుమ్మక్కయ్యారా..? – మంత్రి అంబటి
టీడీపీ నేతలు దారుణాలకు పాల్పడుతుంటే, తాము ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని అంబటి ఆరోపించారు