Mantena Ramaraju : కూతురి పెళ్లికి రూ.100 కోట్లు..తిరుమల శ్రీవారికి NRI రామరాజు కళ్లు చెదిరే విరాళం!
- By Vamsi Chowdary Korata Published Date - 12:57 PM, Wed - 26 November 25
తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. రామలింగరాజు అనే భక్తుడు తన కుమార్తె, అల్లుడి పేరు మీద రూ.9 కోట్లు ఇచ్చారు. ఈ మేరకు దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. మరోవైపు, తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. పంచమీ తీర్థం సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తన్మయత్వం పొందారు. శ్రీవారి ఆలయం నుంచి సారె, విలువైన కానుకలు అమ్మవారికి సమర్పించారు.
తిరుమల శ్రీవారిని నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. భక్తులు స్వామివారికి తమకు తోచిన విధంగా కానుకలు, విరాళాల రూపంలో మొక్కులు చెల్లించుకుంటారు. కొందరు హుండీల ద్వారా డబ్బులు, బంగారం, విలువైన వస్తువుల్ని అందజేస్తుంటారు. మరికొందరు భక్తులు, ప్రముఖులు స్వామివారికి ఆభరణాలను అందజేస్తుంటారు. అలాగే కొందరు టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ట్రస్ట్లకు విరాళాలు ఇస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందజేశారు. తన కుమార్తె, అల్లుడు పేరు మీద ఈ విరాళం ఇచ్చారు.
తిరుమల శ్రీవారికి ఎన్నారై మంతెన రామలింగరాజు ఏకంగా రూ.9కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలోని పీఏసి 1, 2,3 భవనాల అధునీకరణకు రూ.9 కోట్లు విరాళం ఇచ్చారు. మంతెన రామలింగరాజు కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజు పేరిట ఈ విరాళాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు అందజేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సమక్షంలో విరాళం అందజేశారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గొప్ప ఉద్దేశంతో భారీ విరాళం అందజేశారు. ఇటీవల రామలింగరాజు మంతెన కుమార్తె నేత్ర, ఎన్నారై వంశీ గాదిరాజు వివాహ మహోత్సవం ఉదయ్పుర్లో జరిగిన సంగతి తెలిసిందే. ఆయన తన కుమార్తె వివాహానికి రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 23న ఫేమస్ బిజినెస్మెన్, తెలుగు మూలాలు ఉన్న ఎన్నారై రామరాజు కుమార్తె నేత్ర మంతెన, వంశీ గాదిరాజుల పెళ్లి రాజస్థాన్లోని ఉదయ్పూర్లోని ఖరీదైన తాజ్ లేక్ ప్యాలెస్లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి వచ్చిన సెలబ్రిటీల లిస్ట్ చాలానే ఉంది. బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటుగా ప్రపంచ ప్రఖ్యాత పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్, ఈ పెళ్లికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ కూడా హాజరయ్యారు.
రామలింగరాజు 2012లో కూడా రూ.16 కోట్లు టీటీడీకి విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా దాతను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందించారు. భవిష్యత్తులో టీటీడీకు మరిన్ని గొప్ప విరాళాలు దాత అందిస్తారని ఆశిస్తున్నామన్నారు. ‘భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం చూపిన ఈ సేవాభావానికి టీటీడీ తరఫున హృదయపూర్వక అభినందనలు. స్వామి వారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఇలానే ఆధ్యాత్మిక సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాం’ అంటూ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ధ్వజావరోహణంతో ముగిశాయి. మంగళవారం రాత్రి 10 గంటలకు ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించారు. గజ పటాన్ని అవనతం చేసి ధ్వజారోహణం నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకునే వారు సమస్త పాపవిముక్తులై, ధనధాన్య సమృద్ధితో తులతూగుతారని ఐతిహ్యం. విషమృత్యు నాశనం, రాజ్యపదవులవంటి సకల శ్రేయస్సులు పొందుతారని విశ్వాసం .
ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, శ్రీనివాసా చార్యులు, పలువురు అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. వేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి విజయవంతంగా నిర్వహించారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారు.
అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం, వజ్రాల అడ్డిగ నగ, సారెతో పాటు తిరుపతి పురవీధులలో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు.
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఒక టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్ తో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. మధ్యాహ్నం 12.10 నుండి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.