Motha Mogiddam: మోత మోగించిన నారా భువనేశ్వరి
చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. బాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదు నిమిషాల పాటు
- By Praveen Aluthuru Published Date - 11:34 PM, Sat - 30 September 23

Motha Mogiddam: చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు శనివారం వినూత్న నిరసన చేపట్టారు. బాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఐదు నిమిషాల పాటు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మరియు ఇతర రాష్ట్రాలలో కూడా టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు రాత్రి 7 గంటలకు వీధుల్లోకి వచ్చి గంటలు మోత మోగించారు, డప్పులు, ఇంట్లోని పాత్రలు కొట్టడం, ఈలలు ఊదడం, వాహనాల హారన్లు మోగించడం ఇలా వినూత్న పద్దతిలో మోత మోగించారు.
ఢిల్లీలో చంద్రబాబు తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్తో పాటు టీడీపీ ఎంపీలు మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి డప్పులు కొట్టారు. ఇక చంద్రబాబు సతీమణి డప్పు మోత మోగించారు. అటు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని టీడీపీ మద్దతుదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడును సిఐడి సెప్టెంబర్ 9న అరెస్టు చేసింది. ప్రస్తుతం చంద్రబాబు జ్యుడీషియల్ కస్టడీలోనే ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్కిల్ స్కామ్ జరిగినట్టు ఆరోపణల నేపథ్యంలో బాబును అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుకు విడుదల చేసిన రూ.371 కోట్లను షెల్ కంపెనీలకు మళ్లించారని ఏపీ సీఐడీ పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను టీడీపీ అధినేత ఖండించారు. తనపై ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గత వారం కొట్టివేసింది. హైకోర్టు ఆదేశాలను ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
Also Read: Hyderabad: మోడీ పర్యటనకు ముందు హైదరాబాద్ లో పోస్టర్లు కలకలం