Jagan : ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన – మంత్రి సత్యకుమార్
Jagan : “జగన్ నర్సీపట్నం పర్యటనకు నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి” అని ప్రశ్నించారు. ప్రజాసేవ పేరుతో కాకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు
- Author : Sudheer
Date : 09-10-2025 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి చెలరేగుతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “జగన్ నర్సీపట్నం పర్యటనకు నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి” అని ప్రశ్నించారు. ప్రజాసేవ పేరుతో కాకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు. “గతంలో జగన్ పర్యటనలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు. ఎక్కడికెళ్లినా వివాదాలు, ప్రేరేపణలు, చట్టసమస్యలు మాత్రమే మిగిలాయి” అని వ్యాఖ్యానించారు.
PM Kisan Yojana: దీపావళిలోపు పీఎం కిసాన్ నిధులు.. ఈ 5 పనులు చేయకపోతే డబ్బులు రావు!
జగన్ పర్యటనల వెనుక రాజకీయ లాభం తప్ప ప్రజా ప్రయోజనం లేదని అన్నారు. ముఖ్యంగా, నర్సీపట్నం మెడికల్ కాలేజీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులపై ఆయనకి ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. “మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం టీడీపీ ప్రభుత్వం తీసుకుంది. కానీ జగన్ ప్రభుత్వం వాటిని సగం దారిలో వదిలేసింది. ఇప్పుడు అదే ప్రాజెక్టులను తన సొంత విజయాలుగా చూపించుకోవడం దారుణం” అని మంత్రి పేర్కొన్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం, జగన్ అభివృద్ధి కాకుండా, అసహనం, విభజన రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
సత్యకుమార్ యాదవ్ విమర్శల్లో రాజకీయ వ్యూహం కూడా దాగి ఉంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సమయంలో, జగన్ పర్యటనల ద్వారా దృష్టి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అభిప్రాయం. “ఏపీ ప్రజలకు ఇప్పుడు అభివృద్ధి కావాలి, పోటీలు కాదు. కానీ జగన్కు మాత్రం రాజకీయ ప్రదర్శనలే ఇష్టం. వికృత మనస్తత్వం కలిగిన నాయకుడి చేతిలో రాష్ట్ర భవిష్యత్తు సురక్షితం కాదు” అని మంత్రి స్ఫష్టం చేశారు. నర్సీపట్నం పర్యటనను చుట్టుముట్టి రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతున్న వేళ, రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.