TDP vs YSRCP : బాబుకు మిగిలేది ఆ నలుగురే – మంత్రి జోగి రమేష్
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు.
- Author : Prasad
Date : 28-08-2022 - 2:02 IST
Published By : Hashtagu Telugu Desk
మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. 45 ఏళ్ల పొలిటికల్ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు కానీ, ఏ వర్గానికి, ఏ కులానికి అయినా మేలు చేసిన దాఖలాలు లేవన్నారు. 33ఏళ్ల పాటు కుప్పం ఎమ్మెల్యేగా పనిచేసి, 45ఏళ్లపాటు కేబినెట్ ర్యాంకులో వివిధ పదవులు నిర్వహించిన బాబు… మా కుప్పానికి ఏం చేశారని?, మాకు ఏం చేయగలిగారని కుప్పం ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబుపై తిరుగుబాటు తన సొంత నియోజకవర్గం కుప్పం నుంచే మొదలైందని.. మరీ ముఖ్యంగా కుప్పంలో ఉన్న బీసీల నుంచే తిరుగుబాటు ప్రారంభమైందన్నారు. రాజకీయంగా తమను వాడుకోవడమే కాకుండా, అధికారంలో ఉన్నప్పుడు బీసీలను చంద్రబాబు చెంచాల్లా చూశారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. బీసీలను బానిసలను చేశారనే అభిప్రాయంతో బీసీ వర్గాల ప్రజలు చంద్రబాబును తరిమి,తరిమి కొట్టడానికి కుప్పం నుంచే నాంది పలికారన్నారు. ఒకవైపు బీసీలు, మరోవైపు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, రైతన్నలు, మహిళలు కూడా చంద్రబాబు మాకు వద్దని చెబుతున్నారు. అసలు చంద్రబాబుకు కుప్పం వచ్చే అర్హత ఉందా అని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆధారపడిందల్లా ఆ నలుగురి మీదేనని.. ఆ నాలుగు గడపల మీదేనన్నారు. ఈనాడు రామోజీరావు గడప, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గడప, టీవీ5 నాయుడు గడప, దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ గడప అంటూ ఆయన ఎద్దేవా చేశారు.