Anti Maoist Operation : భారీ ఎన్కౌంటర్.. మవోయిస్టు అగ్రనేత హిడ్మా హతం?
- By Vamsi Chowdary Korata Published Date - 11:31 AM, Tue - 18 November 25
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల మావోయిస్టు పార్టీ కీలక నేతలు లొంగిపోయారు. దీంతోపాటు కేంద్రం చేపట్టిన భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ మావోయిస్టు పార్టీని కలవరపెడుతోంది. 2026 మార్చిన నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలసిందే. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు.. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరికొంత మంది హతమైనట్లు సమాచారం.
మావోయిస్టు పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల పార్టీలోని కీలక నేతలు లొంగిపోయారు. ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్రం.. మావోయిస్టులు ప్రతిపాదించిన కాల్పుల విరమణ చర్చలను తిప్పికొట్టింది. మావోయిస్టులతో చర్చలు లేవని.. వారు ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని తెగేసి చెప్పింది. 2026 మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేసిన కేంద్రం.. ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భద్రతా దళాలు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో భారీ యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమైనట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఐదుగురు మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్.. మూడు రాష్ట్రాల ట్రై జంక్షన్లో.. భద్రతా దళాలు భారీ యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టాయి. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో.. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు ఐదుగురు మావోయిస్టు పార్టీ కీలక నేతలు హతమైనట్లు సమాచారం.
మరోవైపు, మావోయిస్టు పార్టీ అగ్రనేతల లొంగుబాట్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అగ్రనతేలు వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ఆయుధాలతో సహా లొంగిపోయారు. కుంకటి వెంకటయ్య అలియాస్ వికాస్, మొగిలిచెర్ల వెంకట్రాజు అలియాస్ చందు, తోడెం గంగ అలియాస్ సోనీ (ఛత్తీస్గఢ్) సాధారణ ప్రజల్లో కలవడానికి నిర్ణయించుకున్నారు. ఈ ముగ్గురు నేతలు దక్షిణ బస్తర్ దళంలో కీలక స్థానాల్లో పని చేశారు. మొగిలిచర్ల చందు (45) మావోయిస్టు స్టేట్ కమిటీ నెంబర్గా చేశారు. ఆ తర్వాత మరో కీలక నేత బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ఆయన మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్గా, నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్గా కీలక బాధ్యతలు నిర్వహించారు. బండి ప్రకాష్, దాదాపు 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
కీలక మావోయిస్టు నేతలు మల్లోజుల, ఆశన్న పోలీసులకు లొంగిపోయిన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. మల్లోజుల, ఆశన్నను విప్లవ ద్రోహులని అభివర్ణించింది. వారికి ప్రజలే తగిన శిక్ష విధించాలని.. వారిని తన్ని తరిమేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. పార్టీ కేంద్ర కమిటీతో చర్చించకుండానే వారిద్దరు లొంగిపోయారని ఆరోపణలు చేసింది. వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణభీతి ఉన్నవాళ్లు ఎవరైనా లొంగిపోవచ్చని.. కానీ ఆయుధాలు మాత్రం అప్పగించకూడదని విజ్ఞప్తి చేసింది.