AP CM Chandrababu : ఏపీలో ఆ జిల్లాకు మహర్దశ.. రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు..!
- By Vamsi Chowdary Korata Published Date - 11:59 AM, Fri - 21 November 25
పారిశ్రామిక అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే నినాదంతో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్, స్కై ఫ్యాక్టరీ, గిన్ఫ్రా ప్రెసిషన్, సుగ్నా స్పాంజ్ పవర్ వంటి కంపెనీలు.. భారీ పెట్టుబడులుతో యూనిట్లను నెలకొల్పడానికి ముందుకు వచ్చాయి. కాగా, ఏడాదిన్నర కాలంలోనే అనంతపురం జిల్లాలో రూ. 4,194 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 వేల మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేయాలని లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. అయితే పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకృతం చేయకుండా.. జిల్లాల్లో కూడా ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తోంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రాధాన్యం ఇస్తోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు పరిశ్రమల రాకతోనే ఆర్థిక పురోగతి సాధ్యమవుతుందని విశ్వసిస్తున్న ప్రభుత్వం.. ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులను ప్రోత్సహిస్తోంది.
అన్ని రకాల పరిశ్రమలు అనంతపురం జిల్లాకు క్యూ కట్టేలా.. రాయితీలు, ప్రోత్సాహకాలు, భూమి, నీరు కేటాయింపులు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తోంది. అయితే ఏడాదిన్నర కాలంలోమే దాదాపు రూ. 4,194 కోట్ల పెట్టబుడులు అనంతపురం జిల్లాకు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. దీని ద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా సుమారు 3 వేల మందికి పైగా ఉద్యోగాలు రానున్నట్లు చెప్పింది. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో అనంతపురం జిల్లాకు పలు రకాల పెట్టుబడులు రాగా.. ఇప్పటికే సీఎం చంద్రబాబు కొన్నింటికి శంకుస్థాపన కూడా చేశారు.
ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం.. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలో.. రేమండ్ గ్రూప్ మూడు యూనిట్లను నెలకొల్పనుంది. ఈ మేరకు ఆ సంస్థ రూ. 1200 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. ఇందులో రాప్తాడు దగ్గర అప్పారెల్ పార్కు కోసం రూ. 497 కోట్లు, శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి వద్ద ఆటో కాంపొనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంటు నెలకొల్పడానికి రూ. 441 కోట్లు, టేకులోడు వద్ద ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్ కోసం రూ. 262 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ మూడు యూనిట్లతో.. 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నట్లు తెలిపింది.
స్కై ఫ్యాక్టరీ అనే సంస్థ కళ్యాణదుర్గంలోని తిమ్మసముద్రం వద్ద ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందు రూ. 1,300 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. వెయ్యి ట్యాక్సీల తయారీ లక్ష్యంగా ఈ యూనిట్ 2027 నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది. ఈ పరిశ్రమ ద్వారా 180 మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. దీనికి సమీపంలోనే గిన్ఫ్రా ప్రెసిషన్ ప్రైవేటు లిమిటెడ్ అనే కంపెనీ.. బై మాడ్యూలర్ ఛార్జ్ సిస్టమ్స్ తయారు చేసేందుకు యూనిట్ను ఏర్పాటు చేసేందుకు రూ. 1,150 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ 121 ఎకరాల్లో తయారీ యూనిట్ నెలకొల్పేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాడిపత్రి మండలం బోగసముద్రం వద్ద కార్యకలాపాలు నిర్వహిస్తున్న సుగ్నా స్పాంజ్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ.. మరో యూనిట్ నెలకొల్పేందుకు రూ. 1,247 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందింది. ఈ కొత్త తయారీ యూనిట్లో 1,100 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.