Nadendla Brahmam Chowdary: కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి కి బ్రెయిన్ స్ట్రోక్
- Author : Vamsi Chowdary Korata
Date : 16-07-2026 - 2:04 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే ఆయన్ను తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి బ్రహ్మం చౌదరి తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. వెంటనే ఆయన్ను మణిపాల్ ఆస్పత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు వెంటనే పరీక్షలు నిర్వహించారు. మెదడులోని ఒక ప్రధాన రక్తనాళంలో (మేజర్ బ్లడ్ వెస్సెల్) రక్తం గడ్డకట్టినట్లు (బ్లడ్ క్లాట్) గుర్తించారు. ఆయనకు అత్యవసరంగా చికిత్స చేసి ఆ క్లాట్ను విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన క్రమంగా కోలుకుంటున్నారని టీడీపీ నేతలు తెలిపారు.
నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. టీడీపీ నేతలు, ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు. ‘బ్రెయిన్ స్ట్రోక్తో మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మం చౌదరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బ్రహ్మం చౌదరి సతీమణి గౌతమీ శ్వేతను ఫోన్లో పరామర్శించాను. అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చాను. మణిపాల్ వైద్యులతో మాట్లాడి బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాను. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరాను’ అని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
రెండు వారాల క్రితం బ్రహ్మం చౌదరి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమి శ్వేత (స్వాతిరెడ్డి)తో వివాహం చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహమని చెబుతున్నారు. తిరుమలలోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో నిర్వహించిన వేడుకకు టీడీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అనంతరం ఈ నెల 6న మంగళగిరి సీకే కన్వెన్షన్లో నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమీ శ్వేత వివాహ రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నేతలు హాజరయ్యారు. వివాహం జరిగిన రెండు వారాలకే బ్రహ్మం చౌదరి బ్రెయిన్ స్ట్రోక్తో ఆస్పత్రిపాలయ్యారు. బ్రహ్మం ఆరోగ్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నాదెండ్ల బ్రహ్మం చౌదరి విద్యార్థి దశ నుంచి టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఆయన్ను కూటమి ప్రభుత్వం కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్గా నామినేటెడ్ పదవిలో నియమించింది. బ్రహ్మం చౌదరి టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమి శ్వేత (స్వాతి రెడ్డి)తో పెళ్లి చేసుకున్నారు. గౌతమి శ్వేత స్వాతిరెడ్డిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. టీడీపీ తరఫున తన వాయిస్ వినిపిస్తుంటారు. బ్రహ్మం, స్వాతిరెడ్డిల మధ్య పరిచయం ఉంది. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.

నాదెండ్ల బ్రహ్మం చౌదరి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన మణిపాల్ ఆస్పత్రి..!