AP Three Capital Issue: ఖజానాలో నిథులు లేకుండా.. మూడు రాజధానులు ఎలా కడతారు..?
- By HashtagU Desk Published Date - 04:20 PM, Sat - 26 March 22

ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రజలకు చేర్చినా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. దీంతో వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురవుతోంది. ఇక ఏపీ మూడు రాజధానుల వ్యవహారం సర్కారు మెడకు పాములా చుట్టుకుంటోంది. మూడు రాజధానుల పై ఉన్న శ్రద్ధ, ఇతర విషయాల మీద లేదని అధికార వైసీపీ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ఖజానాలో నిధులు లేకున్నా, మూడు రాజధానులు ఎలా కడతారనే ప్రశ్న రాష్ట్ర ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే కోర్టు సైతం అక్షింతలు వేసినా, వైసీపీ ప్రభుత్వం మాత్రం వికేంద్రీకరణే మా ప్రభుత్వ విధానమంటూ, మూడు రాజధానులకే ఓటు వేసేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోరాజకీయంగా లబ్ధిపొందేందుకే మూడు రాజధానుల అంశం తెరపైకి తెస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం ఇప్పటి నుంచే రాష్ట్రంలో ప్రాంతాల మధ్య విద్వేషాలు రగుల్చుతోందని, జగన్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ చేస్తున్న మాయాజాలం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. దాదాపు రెండున్నరేళ్ళ పాలనలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకపోయినా, నిత్యం ప్రజావ్యతిరేక పనులు చేస్తూ కోర్టుల చేత చీవాట్లు తినడం, జగర్ సర్కార్కు అలవాటుగా మరిపోయింది. ఇప్పటికే ప్రభుత్వంపై వందల కేసులు కోర్టుల్లోనే పెండింగులో ఉన్నాయి. దీంతో ప్రజల్లో కూడా అధికార వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరుగుతోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు పరాభవం తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక స్థితి మరింత దిగజారిపోయింది. దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు లాగా అప్పులతో నెట్టుకు రావాల్సి వస్తోంది. దీంతో భవిష్యత్త్లో కూడా సర్కారు కొలువు దీరితే ప్రభుత్వాన్ని నడపడం కష్టమేనని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో మూడు రాజధానుల వ్యవహారాన్ని ముందు పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ సర్కారు సిద్ధమవుతున్నట్లు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మరి మూడు రాజధానుల అంశం వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని ప్లస్ అవుతుందా లేదా అనేది ఆశక్తిగా మారింది. ఎందుకంటే అసలే రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేదని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో నిథులు లేకుండా మూడు రాజధానులు ఎలా కడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఇదే విషయంపై, జనాలు నిలదీస్తే, సీఎం జగన్ అండ్ వైసీపీ నాయకులు దగ్గర సమాధానం ఉందా అని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.