AP Legislative Council Chairman Sharif: ఏపీ మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సంచలన నిజాలు!
- Author : Vamsi Chowdary Korata
Date : 03-04-2026 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
Amaravati గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల బిల్లు సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ స్పందించారు. నాడు ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి కులం పేరుతో దూషించారని ఆరోపించారు. తనను బెదిరించి, ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేశారన్నారు. శాసనమండలినే రద్దు చేస్తామన్నా సరే, తాను నిబంధనలకు లోబడి ఆ రోజు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ధర్మంవైపు నిలబడ్డానన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇద్దరు మంత్రులు తన పట్ల దారుణంగా ప్రవర్తించారని శాసనమండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ అన్నారు. మూడు రాజధానుల బిల్లు శాసనమండలికి వచ్చిన సమయంలో జరిగిన పరిణామాలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో ఓ మంత్రి తనపై చేయి చేసుకున్నారని, మరో మంత్రి తనను దారుణంగా దూషిస్తూ తన పుట్టుకను నిందించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలపడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లోనూ వేడుకలు నిర్వహించారు. అక్కడ శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఎ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శాసనమండలిలో సిబ్బంది తన దగ్గరకు రాకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడ్డుకుని తనపైకి వచ్చారన్నారు షరీఫ్. ఆ పార్టీ సభ్యులంతా కుర్చీలు, బెంచీలు ఎక్కి టేబుల్ మీద కూర్చున్నారన్నారు. తనను బెదిరించడంతో పాటు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారన్నారు. తనకు డబ్బు లేదని బతుకుదెరువు చూపిస్తామని తనతో చెప్పారని వివరించారు. చివరికి శాసనమండలినే రద్దు చేస్తామని బెదిరించారన్నారు షరీఫ్. అయినా సరే తాను ఎక్కడా నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదన్నారు. నమాజ్ చేసుకుని అల్లాను ప్రార్థించుకుని సత్యం వైపు నిలబడ్డానన్నారు.
ఆనాడు శాసనమండలి ఛైర్మన్ హోదాలో తనకు ఉన్న అధికారంతో మూడు రాజధానుల బిల్లును ఆమోదించలేదన్నారు. తనకు ఎంత ఒత్తిడి వచ్చినా, బెదిరించినా ధర్మంవైపు నిలబడ్డానని ఎమోషనల్ అయ్యారు. తనను శాసనమండలి ఛైర్మన్ పదవి నుంచి దింపేందుకు కుట్రలు జరిగాయన్నారు. ఎట్టకేలకు ఇప్పుడు అమరావతిని రాజధానిగా చట్టం చేస్తుండటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు తనకు ఎమ్మెల్సీగా, ఆ తర్వాత మండలి ఛైర్మన్గా అవకాశం ఇచ్చారన్నారు షరీఫ్. పార్టీలో చిత్తశుద్ధితో పనిచేసినందుకు ఈ అవకాశం కల్పించారని, తాను ఆ రుణం తీర్చుకునే అవకాశం శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లు చర్చకు వచ్చినప్పుడు లభించిందన్నారు. ఆ రోజు మూడు రాజధానుల బిల్లు సమయంలో చంద్రబాబు శాసనమండలిలోని ఎదురుగా గ్యాలరీలో కూర్చున్నారని, అమరావతిపై ఆయన తపన, ఆలోచన వృథాగా పోకూడదనే చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నట్లు షరీఫ్ తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల పేరుతో వికేంద్రీకరణ బిల్లును తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆమోదం తర్వాత శాసనమండలి ఆమోదానికి పంపారు. అయితే శాసనమండలిలో హైడ్రామా నడిచింది. అప్పటి శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ తనకున్న విచక్షణాధికారంతో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపారు. ఆ తర్వాత నాటకీయ పరిణామాలు జరిగాయి. గత ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేసి ఆ తర్వాత వెనక్కు తీసుకుంది. ఆ సమయంలో జరిగిన పరిణామాలను షరీఫ్ ప్రస్తావించారు.