TDP vs YSRCP : వైసీపీ రాజకీయ లబ్ది కోసమే మూడు రాజధానులు – మాజీ మంత్రి యనమల
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అన్ని...
- By Prasad Published Date - 01:50 PM, Wed - 26 October 22

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు. అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రకు అన్ని ప్రాంతాల నుంచి వస్తున్న స్పందన చూసి ఎలాగైన అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం చేయని పన్నాగం లేదన్నారు. రైతులపై రౌడీలతో దాడులు చేయించారని.. దుర్బాషలాడించారని.. ఆఖరికి వారిపై రాళ్లు, పెట్రోల్ బాటిళ్లు విసిరారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అమరావతి అంటే అంత కక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. మూడు రాజధానుల గురించి మాట్లాడే హక్కు వైసీపీ శాసనసభ్యులకు లేదని.. జగన్ రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలోనూ, సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సకాలంలో పొందడంలోనూ విఫలమైందన్నారు. హైకోర్ట్ ఆర్డర్ ఉనికిలో ఉన్నప్పుడు మూడు రాజధానుల గురించి ఎలా మాట్లాడతారని యనమల ప్రశ్నించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని ప్రచారం ముసుగులో ఆ మూడు జిల్లాలకు చెందిన విలువైన ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించారు.