Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు
- Author : Vamsi Chowdary Korata
Date : 16-07-2026 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్లో కొద్దిరోజులుగా వాన జాడ లేదు.. ఎండలు, వేడిగాలుల తీవ్రత కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. వాయవ్య బంగాళాఖాతం, ఒడిశా-పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది.. ఇది నైరుతి దిశగా పయనిస్తుందని వాతావరణశాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో ఇది బలపడి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. వీటికి తోడు వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయి.
ఈ ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ మరియు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. అలాగే ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే ఈ అల్పపీడన ప్రభావంతో ఈశాన్య మరియు తూర్పు భారత్లో రానున్న ఏడు రోజుల పాటు వర్షపాతం పెరిగే అవకాశం ఉందంటున్నారు. అక్కడక్కడ భారీ వానలు పడొచ్చని.. జులై 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు.
దేశవ్యాప్తంగా ఎల్నినో వల్ల రుతుపవనాలు బలహీనపడటంతో ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షపాతంలో లోటు నమోదైంది. గత వారంలో సగటు వర్షపాతం కంటే 14 నుంచి 39 శాతం వరకు లోటు ఉంది. ఎల్నినో దెబ్బకు వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటున్నాయని అంటున్నారు. వాతావరణ పరిస్థితులు మారుతున్నాయని.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. మరో రెండు అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురిస్తే బాగుంటుందని.. కొంత మేలు జరుగుతుందని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.. వర్షాలు పడక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ఎండలు, వేడిగాలుల తీవ్రత పెరగడంతో ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. సమ్మర్ 2.0 కనిపిస్తోందని చాలామంది అంటున్నారు.