Chandrababu: పవన్ ఇంటికి బాబు… పదేళ్ల తర్వాత కీలక భేటీ
టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై
- Author : Praveen Aluthuru
Date : 18-12-2023 - 7:15 IST
Published By : Hashtagu Telugu Desk
Chandrababu: టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆదివారం రాత్రి మాదాపూర్లోని పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన ఇప్పటికే నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు పవన్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ఆయన నివాసానికి వెళ్లి కలిశారు.
సమావేశం అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ .. భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్ సుమారు రెండున్నర గంటల పాటు చర్చించారని చెప్పారు. సుపరిపాలన, వైకాపాను ఎదుర్కోవడానికి ఎలా పని చేయాలని చర్చించామని ఆయన చెప్పారు. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండేలా ఈ చర్చలు ఉపయోగపడనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా విజయం సాధించేందుకు ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తామన్నారు. మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Also Read: Irrigation Projects : జల ప్రాజెక్టుల చిట్టా తీయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం ఆర్డర్