BRS in AP: ఏపీ రాజకీయాల్లో ‘బీఆర్ఎస్ ‘ బోల్తా
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది ఒక సంబరమే... రాజకీయపార్టీలకు పండుగ... ప్రజలకు కాలక్షేపం... నాయకులకు చేతినిండా పనే.. తినేవాడికి తిన్నంత... తాగినోడికి తాగినంత... దొరికినోడికి దొరికినంత... దండుకున్నోడికి దండుకున్నంత... ఇది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల తంతు.
- By CS Rao Published Date - 11:04 AM, Mon - 10 April 23
BRS in AP : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అది ఒక సంబరమే… రాజకీయపార్టీలకు పండుగ… ప్రజలకు కాలక్షేపం… నాయకులకు చేతినిండా పనే.. తినేవాడికి తిన్నంత… తాగినోడికి తాగినంత… దొరికినోడికి దొరికినంత… దండుకున్నోడికి దండుకున్నంత… ఇది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఎన్నికల తంతు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి ప్రారంభమైందనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతాపార్టీ, ఉభయ కమ్యూనిస్టుల పార్టీలతో పాటు బీఎస్పీతో పాటు పలు అనుబంధ పార్టీలు ఎన్నికల సరళలిలో కనిపిస్తున్నాయి. ఇప్పుడు 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు మరో ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. అదేమిటంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన తెలంగాణ రాష్ట్ర సమితి. ఇటీవల భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన పార్టీ ఏపీ ఎన్నికల్లో మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ప్రకటించారు.
ఇక్కడే చర్చకు ప్రారంభమైందనే చెప్పాలి. భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ 2014కు ముందు ఆంధ్రా ప్రజలపైనా… ఆంధ్రా పాలకులపైన… ఆంధ్రా ప్రాంతపు ఆచార వ్యవహారాలపైన చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే.. ఒకపార్టీకి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో… సందర్భంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రాంతాలు… అన్ని రాష్ట్రాలను గౌరవించడంతోపాటు ఆయా రాష్ట్రాల ఆచార వ్యవహారాలపై ఆచితూచి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యలు పూర్తి అభ్యంతరకరమైనవిగా అప్పట్లో అందరూ బాహాటంగానే విమర్శించారు.
మరి ఇప్పుడు ఎన్నికల వేళ ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుందా…? లేక బెడిసి కొడుతుందా అనేది ఆపార్టీ పెద్దలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తెలంగాణ ప్రాంతం… లేదా తెలంగాణ రాష్ట్ర పరిధిలోని జిల్లాల అభివృద్ధి ఆంధ్రా పాలకుల చేతుల్లో మగ్గిపోయిందని ఆక్రోషాన్ని వెళ్లగక్కిన వాళ్లు ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి దిగుతారు..? అనేది కేవలం రాజకీయపార్టీలకు చెందిన నాయకులే కాదు… వ్యవసాయ క్షేత్రాల్లో కూలి పనికి వెళ్లే ప్రజలు కూడా నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏసీ గదుల్లో కూర్చొని… నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని… పార్టీలను ఎన్నికల బరిలోకి దింపడం మూలంగా ఓట్లు చీలిపోవడమే తప్ప.. ప్రజలకు ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేదన్న విషయం ఇప్పుడు ప్రధాన చర్చకు దారితీస్తోంది.
దశాబ్ధాల కాలం నుండి తెలంగాణ ప్రాంతం పాలకుల చేతుల్లో నలిగిపోయిందన్న వాదనలపై గత 9 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత చేసిన అభివృద్ధి ఏమిటో ఇప్పుడు ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రా పాలకుల చేతుల్లోనుండి విడిపించుకోవాలన్న మీ తపన… మీ ఉద్దేశం మంచిదే. ప్రత్యేక తెలంగాణను సాధించేందుకు మీరు చేసిన కృషి, ప్రాణత్యాగాలు, ఎంతో మందిని పొట్టన పెట్టుకున్న ఉద్యమాలు, ర్యాలీలు, సభలు సమావేశాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన వారి పేర్లు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వినిపించడం లేదనేది తెలంగాణ వాదుల ఆవేదన.
త్యాగాల గడ్డపై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు పరిపాలన దశ, దిశ మార్చుకొని నాటి అమరవీరుల ఆత్మలు ఘోషించే విధంగా ఉందనే విమర్శలు పెద్ద ఎత్తునే వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని త్యాగవీరుల కుటుంబాలకు ముందుగా మీరు తగిన మేలు చేసిన తరువాత ఇతర కుటుంబాలకు మీరు బాసటగా నిలవాల్సింది అనే బాధ ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోని పల్లె పల్లెల్లోనూ వినిపిస్తున్న మాట. ఉద్యమాల చేసిందెవరు..? ఉవ్వెత్తున తెలంగాణ నినాదాన్ని ఆకాశానికి అందేలా అరచిన గొంతులెవరివి…? ఇప్పుడు అధికారపీఠంపై కూర్చున్న పెద్దలు ఎవరు..? అనే అనుమానాలు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల మనసులను తొలిచేస్తున్న ప్రశ్న. మరి దీనికి సమాధానం చెప్పేదెవరు..?
ఆంధ్రా రాజకీయాలను బీఆర్ఎస్ (BRS) శాసిస్తుందా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను బీఆర్ఎస్… భారత రాష్ట్ర సమితి పార్టీ శాసిస్తుందా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటేనే అగ్గిమీద గుగ్గిలం చందాన చిందులు వేసిన వాళ్లు… ఇప్పటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపై వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నారంటే ఎన్నో రకాల అనుమానాలు సామాన్య మానవుడు మొదలుకొని గ్రామాల్లో చెట్లకింద కూర్చోని ముచ్చట్లు పెట్టే ముసలి వాళ్ల వరకూ ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇక నిన్న మొన్నటి వరకూ గొంగడిపురుగు… సీతాకోకచిలుక మాదిరిగా టీఆర్ఎస్పార్టీ ఉన్నట్టుండి బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో ఏపీ ప్రజలు అంత తొందరగా బీఆర్ఎస్ పార్టికి మద్దతు ఇస్తారా? లేదా అనేది అనుమానమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సారధిగా మాజీ ఐఏఎస్ అధికారి పగ్గాలు చేపట్టినా… ప్రస్తుత రాజకీయాలు అంత సులభంగా లేనేలేవు.
గత చరిత్రను తిరగేసి చూస్తే లోక్సత్తా పార్టీని ప్రారంభించిన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాశ్నారాయణను అదే టీఆర్ఎస్ పార్టీ నేతలు సాక్షాత్తు అసెంబ్లీ సమావేశాల్లోనే దాడులు చేసిన సంఘటన ఇప్పటికీ కళ్లముందు కదులుతూనే ఉంది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి, జాతీయస్థాయిలోని నేతలకు రాజకీయ సలహాదారుడిగా… ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జేపీపైనే దాడులు చేసిన సంఘటనల నడుమ ఇప్పుడు ఆపార్టీనే ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారం కోసం బరిలోకి దిగి, రాజకీయాలను శాసించాలని అనుకోవడం ఎండమావిగానే మిగిలిపోతుందనే బలమైన వాదన అన్ని వర్గాల నుండి వినిపిస్తోంది. ఒకవేళ కుల రాజకీయాలపై మొగ్గు చూపించాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తే… ఎంత వరకూ తగిన ఫలితాలను ఇస్తాయన్నది కూడా అనుమానాస్పదమే. ఇప్పటికే అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వామపక్షపార్టీలు హోరాహోరీగా ఎన్నికల బరిలో ఒకరికొకరు గట్టి పోటీని ఇస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అయితే నువ్వా… నేనా..? అన్న విధంగా ఎన్నికల ఫలితాలు ఉంటున్నాయి.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రస్తుతం రాజధాని అంశం అతిముఖ్యమైన సమస్య. దీనిపై అధికార, ప్రతిపక్షపార్టీలు గత నాలుగేళ్లుగా అభివృద్ధిని పక్కనపెట్టి… సవాళ్లు… ప్రతి సవాళ్లతోనే కాలం వెళ్లదీసారన్న అపోహ ప్రజల్లో నాటుకుపోయింది. 10 ఏళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తేనే గగ్గోలు పెట్టిన తెలంగాణ ప్రాంత నేతలు ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రా ప్రజలను ఏమని చెప్పి ఓట్లు అడుగుతారు…? రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయే అంచనా వేశారా? ఇంత వరకూ రాష్ట్రంలో ఏ ఒక్కజిల్లాలోనూ పార్టీ కార్యాలను పూర్తిస్థాయిలో ప్రారంభించనే లేదు. ఏడాదిలోపు జరిగే ఎన్నికలు తాము సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇవ్వడం దేనికి నిదర్శనం…? 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమయాల్లో… సందర్భాల్లో… అన్ని అనుమతులు ఇచ్చారా? అసలు ఏపీకి చెందిన ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడ కొనసాగించేందుకు సహకరించారా? రాష్ట్ర విభజన చట్టం లోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కన్న అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలి పోయాయి.
మరోవైపు ఆంధ్రప్రదేశ్కు జీవనాధారమైన పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన BRS పార్టీ. ఏపీకి చెందాల్సిన ఆస్తులను ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందజేయనే లేదు. రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా… ఆంధ్రా తెలంగాణ మధ్య ఎన్నో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాని ఉండిపోయాయి. సమస్యల పరిష్కారానికి సంబంధించిన అంశాలను చర్చించకుండా… తాత్కాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిశితంగానే గమనిస్తూ ఉన్నారు. రాజకీయపార్టీల మధ్య వైరం ఎప్పుడూ ఉంటుంది. కానీ దేశంలోని ప్రజలందరూ కలిసిమెలసి ఉండలన్న లక్ష్యంతోనే నేతలు పనిచేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. చుట్టూ ఇన్ని సమస్యలు… అనుమానాలు… అపోహలను ముందుంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు సిద్ధం కావడం ఒక్కింత ఆలోచించాల్సిన విషయమే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఏపార్టీ అయినా ఎన్నికల్లో ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాత బరిలోకి దిగి తమ బలాబలాలను తేల్చుకోవచ్చు. కానీ బిఆర్ఎస్ పార్టీ ఏపీలో అడుగు పెట్టాలంటే అడుగడుగునా సవాళ్లే ముందున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు దూసుకుపోగలదా..? తెలంగాణ రాష్ట్రంలో అతి వేగంగా పరుగులు పెట్టే కారు. ఆంధ్రాలోని రోడ్లపై అంత సులువుగా వెళ్లగలదా..? అన్న అనుమానాలు ప్రతీ ఒక్క ఓటరు మదిలో మెదులుతూనే ఉన్నాయి. కేవలం రాజకీయపార్టీల నేతలే కాదు… రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరూ అదే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్ఎస్ పార్టీ 2024 ఎన్నికల్లో పోటీకి చేయడానికి అభ్యర్థులు కరువు లేకపోవచ్చు… ఎందుకంటే.. ఇప్పుడున్న తాజా పరిస్థితుల్లో జంపింగ్ జపాంగ్లు బాగానే ఉన్నారు.
అధికారపార్టీ వైకాపా నుండి టిడిపిలోకి… టిడిపి నుండి వైకాపా లోకి… అలాగే జనసేన, బీజేపీ పార్టీల్లో చేరడానికి ఆశావాహులు బాగానే ఉన్నారు. ఈ జంపింగ్ జపాంగ్లకు కావలసిందల్లా ఎన్నికల్లో పోటీ చేయడం… అదృష్టం ఉండి గెలిస్తే ఆ తరువాత… అధికారంలోకి వచ్చే పార్టీలోకి మళ్లీ జంపింగ్ జపాంగే… ఇదీ వారి వరుస. ఈ నేపథ్యంలో ఏపార్టీకి అయినా ఎన్నికల బరిలోకి దిగడానికి అభ్యర్థుల కొరత మాత్రం ఉండదు. కానీ గెలుపు ఓటములను శాసించే ఓటింగ్పై వీరి ప్రభావం పడటంతో పాటు ఓట్లు చీలిపోవడం కూడా సహజమే. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులు కొన్ని సందర్భాల్లో అంతర్గత ఒప్పందాలకు లోబడి *మిడిల్ డ్రాప్*ల సంఖ్య కూడా బాగానే ఉంటుంది.
ఈ పరిణామాలపై అన్ని రాజకీయపార్టీలు ఇప్పటి నుండి తీవ్ర ఆందోళన చెందుతూనే ఉన్నాయి. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందాన కొత్తగా ఏపీ రాజకీయాల్లో BRS… పార్టీ అరంగేట్రం. ఆంధ్రా ప్రజలు బీఆర్ఎస్ను ఆదరిస్తారా…? లేదా అన్నది వేచిచూడాల్సిందే.
Also Read: BRS Suspends Ponguleti: పొంగులేటి, జూపల్లిపై కేసీఆర్ వేటు.. పార్టీ నుంచి సస్పెండ్..!
Related News
AP : జగన్ రెడ్డి ఎంత పెద్ద కుట్రకు తెర లేపాడో ..!! – టీడీపీ బట్టబయలు
ఓడిపోతున్నా అని తెలిసి, కౌంటింగ్కి ఆటంకం కలిగించటానికి జగన్ రెడ్డి ఎంత కుట్రకు తెర లేపాడో చూడండి