Purandeswari: పురందేశ్వరికి కీలక పదవి.. బీజేపీ పెద్ద స్కెచ్
డిప్యూటీ స్పీకర్ పదవిని కేవలం దక్షిణాదికి చెందిన నేతకే(Daggubati Purandeswari) ఇవ్వాలని బీజేపీ డిసైడయ్యింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది.
- By Pasha Published Date - 06:31 PM, Thu - 10 April 25

Purandeswari: ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి కీలక పదవి దక్కబోతోంది. ఆమెకు ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఇవ్వాలని కమల దళం పెద్దలు యోచిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారికే ఇవ్వాలని నిర్ణయించారు. కిషన్ రెడ్డితో బీజేపీ పెద్దలు చర్చించగా.. తనకు పార్టీ జాతీయ చీఫ్ పదవిపై ఆసక్తి లేదని చెప్పారట. దీంతో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్కు పార్టీ చీఫ్ పదవిని ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక ఇదే సమయంలో ఏపీలో బీజేపీకి సారథ్యం వహిస్తున్న పురందేశ్వరికి ప్రమోషన్ ఇవ్వాలని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నిర్ణయించారట. ఇందులో భాగంగా ఆమెను లోక్సభ డిప్యూటీ స్పీకర్గా చేయాలని భావిస్తున్నారట. తద్వారా ఏపీలోని మహిళా ఓటర్లను, కమ్మ వర్గం ఓటర్లను బీజేపీ వైపునకు తిప్పుకోవచ్చని వారు అనుకుంటున్నారట.
Also Read :KCR : ఏఐజీ ఆస్పత్రికి గులాబీ బాస్.. ఏమైంది ?
చంద్రబాబు, నితీశ్ల సహకారంతో..
తొలుత డిప్యూటీ స్పీకర్ పదవిని మిత్రపక్షాన్ని ఇచ్చేయాలని బీజేపీ భావించింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు (టీడీపీ), బిహార్ సీఎం నితీశ్ కుమార్ (జేడీయూ)లను సంప్రదించాక అభిప్రాయాన్ని మార్చుకుంది. వారిద్దరి సమ్మతి మేరకు తమ పార్టీ నేతకే డిప్యూటీ స్పీకర్ పదవిని కట్టబెట్టాలని డిసైడ్ అయ్యింది. చంద్రబాబుకు బంధువు కావడంతో డిప్యూటీ స్పీకర్గా పురందేశ్వరి ఎన్నికకు టీడీపీ సహకారం లభిస్తుంది. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ మాటను జవదాటే పరిస్థితుల్లో నితీశ్ కుమార్ లేరు.
Also Read: Lemon On Your Face: ముఖంపై నిమ్మకాయను రుద్దుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
ఈ పదవి దక్షిణాదికే.. ఎందుకంటే..
డిప్యూటీ స్పీకర్ పదవిని కేవలం దక్షిణాదికి చెందిన నేతకే(Daggubati Purandeswari) ఇవ్వాలని బీజేపీ డిసైడయ్యింది. దీనికి ఒక బలమైన కారణం ఉంది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రాల్లోనే బలంగా ఉంది. ఇక్కడి నుంచే దానికి అత్యధిక సంఖ్యలో ఎంపీ సీట్లు వచ్చాయి. భవిష్యత్తులో ఏపీ, కర్ణాటక, తమిళనాడుల్లో ఏదో ఒక విధంగా రాజకీయంగా పైచేయిని సాధించాలనే పట్టుదలతో ప్రధాని మోడీ ఉన్నారు. పురందేశ్వరి లాంటి నాయకురాలిని డిప్యూటీ స్పీకర్గా చేస్తే ఈ మూడు రాష్ట్రాలలోని మహిళా వర్గంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆయన భావిస్తున్నారు. హిందీ, ఇంగ్లీషు భాషలపై పురందేశ్వరికి మంచి పట్టు ఉంది. గతంలో ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసినందున.. పార్లమెంటరీ వ్యవహారాలపైనా ఆమెకు అవగాహన ఉంది. అందుకే డిప్యూటీ స్పీకర్ పదవిని పొందే అన్ని అర్హతలు పురందేశ్వరికి ఉన్నాయని భావిస్తున్నారు.