Minister Amarnath : చంద్రబాబుపై రౌడీషీట్ తెరవాలి – మంత్రి అమర్నాథ్
ఇటీవల జరిగిన పుంగనూరు హింసాత్మక ఘటనకు సూత్రధారైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రౌడీషీట్ను తెరవాలని
- By Prasad Published Date - 08:22 AM, Wed - 9 August 23

ఇటీవల జరిగిన పుంగనూరు హింసాత్మక ఘటనకు సూత్రధారైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రౌడీషీట్ను తెరవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. పుంగనూరులో అల్లర్లకు టీడీపీ నేతలు ముందే ప్లాన్ చేశారని ఆరోపించారు. ఈ ఘటనను దుర్మార్గపు దాడిగా అభివర్ణించిన అమర్నాథ్.. రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇంతకు ముందు ఏ రాజకీయ పార్టీ ఇలా చేయలేదన్నారు. దాడి సమయంలో పోలీసులను కూడా చంపాలనుకున్నారని ఆయన ఆరోపించారు. శాంతిభద్రతల పరిరక్షణలో 40 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని ఆయన విచారం వ్యక్తం చేశారు. తిరిగి అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు తన పార్టీ కార్యకర్తల ప్రాణాలను త్యాగం చేయడానికి వెనుకాడరని అమర్నాథ్ అభిప్రాయపడ్డారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవలేమన్నందుకే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. హింసను ప్రేరేపిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వదిలిపెట్టదని మంత్రి హెచ్చరించారు. సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తామనే సాకుతో చంద్రబాబు నాయుడు పన్నిన ఈ కుట్రలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి అమర్నాథ్ ప్రజలను కోరారు.