ఆరు నెలల్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు
- Author : Vamsi Chowdary Korata
Date : 14-03-2026 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
Andhra Pradesh CM Chandrababu Naidu ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను రానున్న ఆరు నెలల్లో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు ఈ కీలక ప్రకటన చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపు బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రులు తీసుకోవాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సమన్వయం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు స్పష్టతనిస్తామని, ఏ ఎన్నిక జరిగినా కూటమి జెండా ఎగరడమే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ పాలకవర్గాలు 2021 మార్చిలో జరిగిన ఎన్నికల ద్వారా కొలువుదీరాయి. వీరి ఐదేళ్ల పదవీకాలం 2026 మార్చి-ఏప్రిల్ నాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో గడువు ముగియకముందే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని, 2026-27 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలవాలని సీఎం ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి మంత్రులు, కార్యదర్శుల పనితీరుపై ఏప్రిల్ 2న రహస్య నివేదికలు (కాన్ఫిడెన్షియల్ రిపోర్టులు) ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నిర్దేశిత లక్ష్యాల సాధన, దస్త్రాల పరిష్కారం, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో చూపిన చొరవ ఆధారంగా ఈ రిపోర్టులు ఉంటాయని వివరించారు. మంత్రులు సచివాలయానికే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావాలని సూచించారు.
అయితే, ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు మంత్రుల వైఖరిపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. “మనం చేసిన మంచి పనులను ప్రజలకు చెప్పుకోకపోతే ఎలా?” అని ఆయన నేరుగా ప్రశ్నించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించుకోవడంలో మంత్రులు వెనుకబడ్డారని, సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే మెరుగైన ఫలితాలు సాధించలేమని హెచ్చరించారు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే సమాచారాన్ని సోషల్ మీడియాలో వేగంగా ప్రచారం చేయాలని మంత్రి నారా లోకేశ్ కూడా ఇదే సందర్భంగా సూచించడం గమనార్హం.