AP Intermediate: రాబోయే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ సిలబస్లో మార్పులు
- By Kode Mohan Sai Published Date - 01:27 PM, Tue - 8 October 24

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియెట్ సిలబస్ మారనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి కొత్త సిలబస్ను అమలు చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వర్తమాన ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు చేయాలని అధికారులు నిర్ణయించారు. జాతీయ స్థాయి సిలబస్ అమలుకు అనుగుణంగా మార్పులు చేపట్టేందుకు ప్రత్యేక కమిటీలను నియమించనున్నారు. పాఠశాల విద్యా బోధనలో మార్పులపై అధ్యయనం కోసం విద్యాశాఖ అధికారులు ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అదే విధంగా, వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ అమలుకు సంబంధించిన తీరుపై ప్రత్యేక కమిటీలు పరిశీలిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, దసరా సెలవుల తర్వాత అధ్యయన కమిటీలు ఏర్పాటు చేయనున్నాయి. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రకారం పాఠశాల విద్య సిలబస్ను మార్చారు. అయితే, ఇంటర్మీడియట్లో దాదాపు 12 సంవత్సరాలుగా పాత సిలబస్సే కొనసాగుతోంది, ఇది 2011-12 విద్యాసంవత్సరంలో ప్రవేశపెట్టబడింది.
ఈ క్రమంలో, ఎన్ఈపీ మరియు ప్రస్తుత అంశాలను పరిగణనలోకి తీసుకుని, సిలబస్ను సవరించి 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఆ తరువాత, 2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్ రెండో సంవత్సరం సిలబస్ను కూడా మార్చనున్నారు.
ఇంటర్ విద్యా మండలి కమిషనర్, కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కృతికా శుక్లా ఇంటర్ విద్యలో పలు మార్పులు తీసుకొచ్చారు. ఆమె బాధ్యతలు చేపట్టాక, జూనియర్ కాలేజీల పనివేళలను ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మార్చారు. యూనిట్ టెస్టుల పేపర్లను రాష్ట్ర కార్యాలయంలోనే తయారుచేసి పంపిస్తున్నారు.
ఈ ఏడాది జరిగిన మొదటి యూనిట్ టెస్ట్ను ఆయా కాలేజీలు నిర్వహించుకోగా, రెండో యూనిట్ టెస్ట్ రాష్ట్రవ్యాప్తంగా ఒకే తరహాలో నిర్వహించారు. దసరా సెలవుల అనంతరం జరగబోయే క్వార్టర్లీ పరీక్ష కూడా ఇదే విధానంలో ఉంటుందని పేర్కొన్నారు. గతంలో, యూనిట్ పరీక్షలు ప్రతి కాలేజీ స్వయంగా నిర్వహించేవి, దీని కారణంగా సిలబస్ పూర్తికాకుండా కొన్ని పాఠ్యాంశాలను మినహాయించి పేపర్లు తయారుచేయబడేవి.
కానీ, కొత్తగా తెచ్చిన కేంద్రీకృత పరీక్షల ద్వారా అన్ని కాలేజీలు ఒకేసారి సిలబస్ పూర్తి చేసేలా మార్పు తీసుకొచ్చారు. ప్రైవేట్ కాలేజీలు కూడా ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. అలాగే, బోర్డు నిర్వహించే వార్షిక పరీక్షలను వచ్చే ఏడాదికి సవరించి, కొత్తగా ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 6-10 తరగతుల వరకు సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో, ఇంటర్ సిలబస్ను జాతీయ సిలబస్కు అనుగుణంగా మార్చాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇంటర్ స్థాయిలో నీట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిలబస్ను అనుసరిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంపీసీ, బైపీసీ గ్రూపులను ఐఐటీ మరియు నీట్ సిలబస్కు అనుగుణంగా సిద్ధం చేయాలనే ఉద్దేశ్యంతో సిలబస్ను మారుస్తున్నారు.