Good News : రైతులకు ఉచితంగా బోర్లు, కరెంట్ అందించబోతున్న ఏపీ సర్కార్
Good News : రైతులకు దాదాపు రూ.2 లక్షల వరకు లాభం చేకూరేలా ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఇది అమలైతే రాష్ట్రంలోని పలువురు చిన్న రైతులకు స్వయం సాగునీటి వనరులు లభించే అవకాశం ఉంది.
- By Sudheer Published Date - 08:35 AM, Fri - 16 May 25

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) రైతులకు తీపికబురు అందించింది. ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని(NTR Jalasiri scheme) మళ్లీ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించి, రాయితీపై సోలార్ లేదా విద్యుత్తు ఆధారిత పంపుసెట్లు అందించనుంది. కేంద్ర ప్రభుత్వ కుసుమ్ పథకాన్ని దీనికి అనుసంధానం చేస్తూ, కేంద్రం 40%, రాష్ట్రం 30% రాయితీ ఇవ్వనుండగా, రైతులు 30% వాటాను భరించాల్సి ఉంటుంది.
Azerbaijan: పాక్కు మద్దతు ఇచ్చే మరో దేశానికి భారీ షాక్ ఇచ్చిన భారత్..!
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–2019 మధ్య ఈ పథకం విజయవంతంగా అమలైంది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అదే పథకాన్ని వైఎస్సార్ జలకళ పేరుతో కొనసాగించినప్పటికీ, కేవలం 25 వేల బోర్లే తవ్వబడి, 2,700 పంపుసెట్లే ఏర్పాటు చేయడంపై విమర్శలు వచ్చాయి. చాలా బోర్లు పనిలోకి రాకపోవడంతో పూడుకుపోయాయని చెప్పబడింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మళ్లీ ఎన్టీఆర్ జలసిరి పేరుతో పునఃప్రారంభం చేస్తూ, ఇందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.50 కోట్లు కేటాయించింది.
ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు సంబంధిత శాఖలు కేంద్ర పునరుత్పాదక విద్యుత్ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి. విద్యుత్తు సౌకర్యం ఉన్న చోట విద్యుత్ పంపుసెట్లు, లేని చోట సోలార్ పంపుసెట్లు ఇవ్వాలని ప్రభుత్వ యోచన. త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు, లబ్ధిదారుల ఎంపిక విధానం విడుదల చేయనున్నారు. రైతులకు దాదాపు రూ.2 లక్షల వరకు లాభం చేకూరేలా ఈ పథకం రూపుదిద్దుకుంటోంది. ఇది అమలైతే రాష్ట్రంలోని పలువురు చిన్న రైతులకు స్వయం సాగునీటి వనరులు లభించే అవకాశం ఉంది.